హైదరాబాద్: శ్రీలంక పర్యటనను టీమ్ ఇండియా ఘనంగా ముగించింది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన ఏకైక టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆతిధ్య జట్టు నిర్దేశించిన 171 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో చేధించింది.
శ్రీలంకతో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(82), మనీశ్ పాండే(51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా... రోహిత్ శర్మ 9, రాహుల్ 24, ధోనీ 1 పరుగులు చేశారు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆస్ట్రేలియా రికార్డు సమం
ఈ విజయంతో కోహ్లీసేన మరో అద్భుత రికార్డుని నెలకొల్పింది. శ్రీలంకను టెస్టుల్లో 3-0తో, వన్డేల్లో 5-0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగే ఏకైక టీ20లో కూడా గెలవడంతో 9-0తో శ్రీలంకను చిత్తుచేసిన జట్టుగా ఘన చరిత్ర సాధించింది. ఇంతకు ముందు ఇలాంటి ఘనత ఆస్ట్రేలియా మాత్రమే సాధించింది.
2009-10లో పాక్ను 3-0తో టెస్టుల్లో, 5-0తో వన్డేల్లో, 1-0తో టీ20లో ఓడించింది. ఇప్పుడు శ్రీలంకపై కోహ్లీసేన సరిగ్గా అలానే విజయం సాధించింది. దీంతో టీమిండియా చరిత్రలోనే ఇది ఓ మైలురాయిగా నిలిచింది.
భారత్ విజయ లక్ష్యం 171
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి శ్రీలంక 170 పరుగులు చేసింది. దీంతో భారత్కు 171 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
దీంతో బ్యాటింగ్కు దిగిన లంకకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ఉపుల్ తరంగ (5) పరుగుల వద్ద భువనేశ్వర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 23 పరుగులకే మరో ఓపెనర్ డిక్వెలా (17)ను బుమ్రా పెవిలియన్కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దిల్షాన్ మునవీర 5 ఫోర్లు, 4 సిక్సులతో 53 పరుగులు చేశాడు.
క్రీజులోకి వచ్చినప్పటి నుంచి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో శ్రీలంక పవర్ ప్లే ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ఆ తర్వాత జట్టు స్కోరు 113 పరుగుల వద్ద పెరీరా (11), శనక (0)ను చాహల్ అవుట్ చేశాడు.
చివర్లో క్రీజులోకి వచ్చిన అషాన్ ప్రియంజన్ (40 నాటౌట్) రెండు సిక్సర్లు బాది మెరవడంతో శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా, భువనేశ్వర్, బుమ్రా చెరో వికెట్ తీశారు.
తగ్గిన వర్షం: కవర్లు తొలగింపు
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన ఏకైక టీ20 మ్యాచ్లో టాస్ ఆలస్యం కానుంది. ఉదయం నుంచి కురిసిన వర్షానికి ప్రేమదాస స్టేడియం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో 7.25 గంటలకు టాస్, 7.40 గంటలకి మ్యాచ్ ప్రారంభం అవుతుందని బీసీసీఐ తన ట్విట్టర్లో పేర్కొంది.
ఈ మ్యాచ్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 50వ టీ20 కావడం గమనార్హం. మరోవైపు చినుకులు పడడం ఆగిపోవడంతో సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. అంపైర్లు పిచ్ను తనిఖీ చేసిన తర్వాత టాస్ వేయనున్నారు. స్టేడియమంతా కప్పి ఉంచిన కవర్లను సిబ్బంది తొలగించారు.
విరామం ఇస్తూ కురుస్తున్న వర్షం కురుస్తుండటంతో మంగళవారమే మైదానాన్ని సిబ్బంది పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఈ పర్యనటలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్, వన్డే సిరీస్ను సొంతం చేసుకున్న కోహ్లీసేన, టీ20ను కూడా తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
అదే సమయంలో, టెస్టు, వన్డే సిరీస్ లను చేజార్చుకుని సొంతగడ్డపై పరాభవం పాలైన శ్రీలంక జట్టు, ఈ మ్యాచ్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. శ్రీలంక పర్యటన తర్వాత కోహ్లీసేన స్వదేశంలో 9 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో రెండు మూడు మ్యాచ్ల సిరీస్లు కూడా ఉన్నాయి.
దీంతో ఈ ఫార్మాట్లో జట్టు బ్యాటింగ్ లైనప్ను పరీక్షించుకునేందుకు ఈ మ్యాచ్ను వినియోగించుకోనుంది. మరోవైపు శ్రీలంక ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. రెండు జట్ల మధ్య జరిగిన టీ20 రికార్డులు పరిశీలిస్తే మొత్తం పది మ్యాచ్లు జరిగాయి. భారత్తో జరిగిన 10 టి20ల్లో శ్రీలంక నాలుగు మ్యాచ్లు గెలిచి ఆరు ఓడింది. అయితే ఈ స్టేడియంలో శ్రీలంక ఆడిన మొత్తం 13 మ్యాచ్ల్లో కేవలం రెండు మాత్రమే నెగ్గడం ఆ జట్టును ఆందోళన కలిగిస్తోంది.
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, పాండే, రహానె, జాదవ్, ధోని, హర్దిక్ పాండ్య, అక్షర్పటేల్, కుల్దీప్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్, శార్దుల్ ఠాకుర్
శ్రీలంక: తరంగ (కెప్టెన్), మాథ్యూస్, డిక్వెలా, మునవీర, షనక, సిరివర్దన, హసరంగ డిసిల్వా, అఖిల ధనంజయ, వాండర్సె, ఉదాన, ప్రసన్న, తిసార పెరీరా, మలింగ, లక్మల్, వికుమ్ సంజయ