కాలికి గాయం
టీమిండియా రెండో ఇన్నింగ్స్ సమయంలో రోహిత్ శర్మ ఆడిన ఓ షాట్ ఆఫ్ సైడ్లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రీలంక ఫీల్డర్ జయవిక్రమ కాలికి బలంగా తగిలింది. రోహిత్ శర్మ బంతిని బలంగా బాదడంతో అది అంతే వేగంతో జయవిక్రమ మోకాలికి తగిలింది. దీంతో గాయంతో జయవిక్రమ గ్రౌండ్లోనే విలవిలలాడాడు. ఫిజియోథెరపీ వచ్చి ప్రాథమిక వైద్యం అందించినప్పటికీ కనీసం లేచి సరిగ్గా నడవలేకపోయాడు. దీంతో ఇతరుల సహాయంతో జయవిక్రమను బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి డ్రెస్సింగ్ రూంలోకి ఎత్తుకుని తీసుకెళ్లాల్సి వచ్చింది. పరిస్థితిని చూస్తే జయవిక్రమ మళ్లీ గ్రౌండ్లోకి రావడం అసాధ్యమనిపించింది. అప్పటికీ జయవిక్రమ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. దీంతో కీలక స్పిన్నర్ మైదానం నుంచి వైదొలగడంతో టెస్టు మ్యాచ్లో శ్రీలంకకు మరిన్ని కష్టాలు తప్పవనిపించింది.
గాయంతోనే బౌలింగ్
కానీ కాసేపటి తర్వాత ఎవరూ ఊహించని రీతిలో జయవిక్రమ మైదానంలోకి వచ్చాడు. మైదానంలోకి రావడమే కాకుండా గాయంతో బాధపడుతూనే బౌలింగ్ కూడా చేశాడు. గాయం ఎఫెక్ట్ను తన బౌలింగ్పై ఏ మాత్రం పడనీయలేదు. కాస్త కుంటుతూనే బౌలింగ్ చేశాడు. కుంటుతూ బౌలింగ్ చేసినప్పటికీ భారత బ్యాటర్లను పరుగులు చేయనీయకుండా ముప్పతిప్పలు పెట్టాడు. కీలక వికెట్లు పడగొట్టి భారత్ను దెబ్బకొట్టాడు.
3 వికెట్లు తీశాడు
ఇలా జయవిక్రమ 13 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. 35 పరుగులతో క్రీజులో కుదురుకున్న హనుమ విహారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న రిషబ్పంత్ను సైతం జయవిక్రమ ఫెమిలియన్ పంపాడు. ఇలా గాయంతోనే ఇప్పటికే 3 వికెట్లు తీసి భారత్ను దెబ్బకొట్టాడు. వికెట్లు తీసిన ఆనందంలో తన గాయాన్ని పూర్తిగా మర్చిపోయిన జయవిక్రమ స్వేచ్ఛగా బౌలింగ్ చేశాడు. వికెట్లు వచ్చిన ఆనందంలో గాయాన్నే మర్చిపోయాడని కామెటేంటర్లు కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో జయవిక్రమ నీకు జేజేలు అంటూ అభిమానులు ప్రశంసల కురిపిస్తున్నారు. టీం కోసం కుంటుతూనే బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీశావని కొనియాడుతున్నారు.
భారీ అధిక్యంలో టీమిండియా
ఇక మ్యాచ్ విషయానికొస్తే సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు స్టడీగా ఆడుతున్నారు. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. మరోవైపు టీమిండియా ఆధిక్యం కూడా ఇప్పటికే 400 పరుగులు దాటింది. దీంతో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక ముందు భారీ లక్ష్యం ఉండడం ఖాయమైపోయింది.