మరికొన్ని రోజుల్లో శ్రీలంక పర్యటనకు భారత్ వెళ్లనుంది. లంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ టీమిండియా ఆడనుంది. అయితే ఇప్పటికే టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లంక వన్డే సిరీస్కు దూరం కానున్నారు. అయితే ఈ స్టార్లు లంక పర్యటనకు దూరమవ్వడానికి విశ్రాంతి కోసమే కాదని, ప్రత్యేక కారణం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ వరుసగా ఆడిన స్టార్లకు శ్రీలంక పర్యటనకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే మరో రెండు ఐసీసీ ట్రోఫీల లక్ష్యంతోనే కోహ్లి, రోహిత్ లంక పర్యటనకు దూరం కానున్నారని బీసీసీఐ అధికారి తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.ఇది వన్డే ఫార్మాట్ సమరం. అలాగే 2025 జూన్లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది.

టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరాలంటే పాయింట్ల పట్టికలో భారత్ టాప్-2లో నిలవాలి. ప్రస్తుతం టీమిండియా అగ్రస్థానంలోనే ఉంది. అయితే రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో రోహిత్ సేన అయిదు టెస్టుల సిరీస్, అలాగే మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్లు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే జరగనున్నాయి. టాప్-2లో నిలవాలంటే కివీస్, ఆసీస్పై భారత్ తప్పక విజయం సాధించాలి.
ఈ నేపథ్యంలో 37 ఏళ్ల రోహిత్, 35 ఏళ్ల విరాట్ కోహ్లి పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుంటూ ఐసీసీ ట్రోఫీపై కన్నేశారు. ఇక వన్డే ఫార్మాట్లో లయను అందుకోవడానికి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్ను ఆడాలని రోహిత్-కోహ్లి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ''వన్డేల ప్రాక్టీస్కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు జరిగే ఇంగ్లండ్ వన్డే సిరీస్ రోహిత్, కోహ్లికి సరిపోతుంది. అయితే వారిద్దరు ఇప్పుడు టెస్టులపై ఫోకస్ పెట్టారు. సెప్టెంబర్ నుంచి జనవరి మధ్యలో భారత్ పది టెస్టులు ఆడనుంది'' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.