ధర్మశాల: రెండో టీ20లో శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, సంజూ శాంసన్ కూడా మెరుపులు మెరిపించారు. దీంతో 184 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా మరో 17 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. లంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 74, జడేజా 45 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ విజయంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అలాగే టీ20 ఫార్మాట్లో టీమిండియాకు ఇది వరుసగా 11వ విజయం కాగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో 8వది కావడం విశేషం.

184 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో చమీర బౌలింగ్లో 9 పరుగుల వద్ద టీమిండియా తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, వన్డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 44 పరుగుల వద్ద ఉండగా 15 బంతుల్లో 16 పరుగులు చేసిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ లహిరు కుమార బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియాను శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 84 పరుగులు జోడించారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ కెరీర్లో ఐదో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
జట్టు స్కోర్ 128 పరుగుల వద్ద ఉండగా 25 బంతుల్లోనే 39 పరుగులు చేసిన సంజూ శాంసన్ కుమర బౌలింగ్లో ఔటయ్యాడు. శాంసన్ ఇన్నింగ్స్లో 2 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. వేగంగా ఆడిన జడేజా భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయ్యర్ 44 బంతుల్లోనే 74 పరుగులు, జడేజా 18 బంతుల్లోనే 45 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో లహిరు కుమార 2, చమీర ఒక వికెట్ తీశారు. అంతకు ముందు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.