
కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించడంపై కెప్టెన్ శిఖర్ ధావన్ సంతోషం వ్యక్తం చేశాడు. యువకులు బాగా ఆడారని ప్రశంసించాడు. జట్టులో కొత్త ఆటగాళ్లున్నా చాలా మంది ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్ ఆడారని గుర్తుచేశాడు. యువ క్రికెటర్లు ఎంతో పరిణతి కలిగిన ఆటగాళ్లని పేర్కొన్నాడు. సెంచరీ కొట్టాలనుకున్నా అని, కానీ అక్కడ ఎక్కువ పరుగులు లేవని గబ్బర్ తెలిపాడు. యువ ప్లేయర్స్ పృథ్వీ షా, ఇషాన్ కిషన్ పరుగులు అన్ని బాదేశారని భారత కెప్టెన్ సరదాగా అన్నాడు. బౌలర్ల క్రమశిక్షణకు టాపార్డర్ మెరుపులు తోడవడంతో భారత్ బోణీ కొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యంగ్ టీమిండియా శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది.
మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ... 'జట్టులో చాలా మంది ఇదివరకే అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. వాళ్లెంతో పరిణతి చెందిన ఆటగాళ్లు. ఇలా ఆడటం చాలా ఆనందంగా ఉంది. వికెట్ ఫ్లాట్గా ఉందని తెలుసు. మా ముగ్గురు స్పిన్నర్లు పదో ఓవర్ నుంచే శ్రీలంకపై ఒత్తిడి తెచ్చారు. ఇక మేం ఛేదనకు దిగినప్పుడు కూడా నాన్స్ట్రైకర్ ఎండ్లో నుంచి మా ఆటగాళ్ల బ్యాటింగ్ చూడటం గొప్పగా ఉంది. ఐపీఎల్లో ఆడటంతో మంచి అవగాహన సంపాదించుకున్నారు. వాళ్ల ఆత్మవిశ్వాసం కూడా చాలా బాగుంది. పృథ్వీ, ఇషాన్ ఆడిన తీరు అత్యద్భుతం. వాళ్లు 15 ఓవర్లలోనే మ్యాచ్ను పూర్తి చేశారు. శతకం బాదాలని అనుకున్నా. కానీ అక్కడ ఎక్కువ పరుగులు లేకపోయాయి. దాంతో చివరివరకు నాటౌట్గా నిలవాలనుకున్నా' అని చెప్పాడు.
లంక పర్యటనలో సారథిగా తొలి వన్డేతోనే పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు గబ్బర్. లంకతో మ్యాచ్లో 95 బంతుల్లో 86 పరుగులు చేసిన ధావన్.. కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో 50 ఓవర్ల ఫార్మాట్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన పదో భారత బ్యాట్స్మన్గా నిలిచాడు గబ్బర్. ఆరు వేల మార్క్ను అందుకున్న వారిలో గబ్బర్ కంటే ముందు మహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. హాఫ్ సెంచరీతో రాణించిన ధావన్ శ్రీలంకపై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. అదీ 17 ఇన్నింగ్స్ల్లోనే.
ఈ మ్యాచ్లో శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు పృథ్వీ షా (43; 24 బంతుల్లో 9x4), కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్; 95 బంతుల్లో 6x4, 1x6) మంచి ఆరంభం ఇచ్చారు. ఆపై వన్డౌన్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ (59; 42 బంతుల్లో 8x4, 2x6), మనీశ్ పాండే (26; 40 బంతుల్లో 1x4, 1x6), సూర్యకుమార్ యాదవ్ (31; 20 బంతుల్లో 5x4) ధాటిగా ఆడి సునాయాస విజయాన్ని అందించారు. దాంతో భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్లో బోణి కొట్టింది. ఇక రెండో వన్డే మంగళవారం ఇదే మైదానంలో జరగనుంది.