
ధర్మశాల: నేడు భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ జరగనున్న హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో వాతావరణం ప్రస్తుతం పొడిగానే ఉన్నప్పటికీ మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావారణ కేంద్రం తెలిపింది. వాతావరణ కేంద్రం తెలిపిన దాని ప్రకారం ధర్మశాలలో శనివారం 90 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. 20-50 మిల్లిమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తేమ సంఖ్య 80-90 శాతం మధ్య ఉంటుంది. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
శనివారం నాటి వాతావరణ సూచన ప్రకారం ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ధర్మశాలలో ప్రస్తుతం సూర్యుడు ఉన్నాడు. దీంతో ప్రస్తుతం ఎలాంటి మేఘాలు లేవు. కానీ మ్యాచ్ సమయం వరకు వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉరుములతో కూడిన వర్షం భారత్, శ్రీలంక రెండో టీ20 మ్యాచ్కు ఆటంకం కల్గించనుంది.
2019 సెప్టెంబర్లో, 2020 మార్చిలో కూడా ధర్మశాలలో సౌతాఫ్రికాతో టీమిండియా ఆడాల్సిన రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. నేడు శ్రీలంకతో జరిగే మ్యాచ్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. కాగా శుక్రవారం ధర్మశాలలోని ఇంద్రునాగ్ ఆలయంలో మ్యాచ్ సజావుగా సాగి, ఇండియా గెలవాలని నిర్వాహకులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అటు అభిమానులు కూడా మ్యాచ్ సజావుగా సాగి ఇండియా గెలవాలని కోరుకుంటున్నారు. మరో వైపు ఈ మ్యాచ్ను వీక్షించడానికి బీసీసీఐ 50 శాతం మంది ప్రేక్షకులను గ్రౌండులోకి అనుమతిచ్చింది. దీంతో ప్రేక్షకులు ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారు.
తుది జట్లు అంచనా
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ మరియు జస్ప్రీత్ బుమ్రా.
శ్రీలంక:
పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, జనిత్ లియానాగే, చరిత్ అసలంక, దసున్ షనక (కెప్టెన్), దినేష్ చండిమాల్ (వికెట్ కీపర్), చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ మరియు లహిరు కుమార.