శ్రీలంక పర్యటనలో భారత్ టీ20ల సిరీస్ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్ను 2-0తో సాధించింది. పల్లెకెలె వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. అయితే ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్బౌల్డ్ అయిన సంజు శాంసన్పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.
మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవరల్లో తొమ్మిది వికెట్లకు 161 పరుగులు చేసింది. కుశాల్ పెరెరా (53; 34 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. రవి బిష్ణోయ్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్ తొలి ఓవర్కు 6/0తో ఉన్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది .

దీంతో లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 6.3 ఓవర్లలోనే ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (30; 15 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సూర్యకుమార్ (26; 12 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), హార్దిక్ పాండ్య (22 నాటౌట్, 9 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు.
అయితే ఓపెనర్గా వచ్చిన శాంసన్ తీక్షణ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై బౌల్డయ్యాడు. గోల్డెన్ డకౌటయ్యాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో శాంసన్ స్పిన్లో తడబాటుకు గురికావడం ఇదేం కొత్తకాదు. తన కెరీర్లో శాంసన్ 25 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. ఔట్ అయిన 22 సార్లలో స్పిన్లోనే పది సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. స్పిన్ బౌలింగ్లో 132 బంతుల్లో 15 సగటుతో 156 పరుగులు చేశాడు. స్ట్రైక్రేటు కూడా 118 మాత్రమే.
దీంతో నెట్టింట్లో శాంసన్పై విమర్శలు వస్తున్నాయి. స్పిన్ బలహీనతను అధిగమించకుండా అవకాశాల కోసం ఎదురుచూడటం క్షమించరాని తప్పు అంటూ కామెంట్లు చేస్తున్నారు. జట్టులోకి శాంసన్ రావాలని డిమాండ్ చేయడం, వచ్చిన తర్వాత అతను పేలవ ప్రదర్శన చేయడం, జట్టులో చోటు కోల్పోవడం ఓ చక్రంలా కొనసాగుతుందని వ్యంగ్యంగా అంటున్నారు. మరోవైపు ఇతర క్రికెటర్లతో పోలిస్తే శాంసన్కు ఇచ్చే అవకాశాలు తక్కువ అని, అప్పుడప్పుడు కాకుండా వరుసగా అవకాశాలు ఇస్తే తన సత్తా నిరూపించగలడని మరికొందరు శాంసన్కు మద్దతు ఇస్తున్నారు.