
లక్నో: శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో అంతర్జతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన గుప్తిల్ (3299) రికార్డును హిట్మ్యాన్ బద్ధలు కొట్టాడు. ఆ రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. శ్రీలంక బౌలర్ జెఫ్రీ వాండర్సే వేసిన తొమ్మిదో ఓవర్ చివరి బంతిని సింగిల్ తీయడం ద్వారా రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 32 బంతుల్లో 44 పరుగులు చేసి లహిరు కుమార బౌలింగ్లో ఔటయ్యాడు. రోహిత్ ఇన్నింగ్స్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
కెరీర్లో ఇప్పటివరకు 123 టీ20 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 33 సగటుతో 3307 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో హిట్మ్యాన్ 292 ఫోర్లు, 155 సిక్సులు బాదాడు. అలాగే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కూడా రోహిత్ శర్మ ఇది వరకే తన పేరు మీద సృష్టించుకున్నాడు. రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మార్టిన్ గుప్తిల్, విరాట్ కోహ్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. గుప్తిలో ఖాతాలో 3299 పరుగులు ఉండగా.. కోహ్లీ ఖాతాలో 3296 పరుగులు ఉన్నాయి.
కాగా శ్రీలంకతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు తొలి వికెట్కు ఏకంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ వరుసగా ఫోర్లు, సిక్సులతో స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో చమిక కరుణరత్నే బౌలింగ్లో ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ ఫోర్లతో అదరగొట్టాడు. అదే దూకుడును కొనసాగించిన కిషన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.
బరిలోకి భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.
శ్రీలంక తుది జట్టు
పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దినేష్ చండిమాల్(వికెట్ కీపర్), జనిత్ లియానాగే, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లహిరు కుమార.