
తొలి సెషన్లో అధిపత్యం
357-6 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తొలి సెషన్లో అధిపత్యం చెలాయించింది. జడేజా, అశ్విన్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అశ్విన్ కెరీర్లో ఇది 12వ హాఫ్ సెంచరీ. అలాగే ఏడో వికెట్కు వీరిద్దరు 130 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొప్పారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 462 పరుగుల వద్ద ఉండగా 61 పరుగులు చేసిన అశ్విన్.. లక్మల్ బౌలింగ్లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
జడేజా సెంచరీ
అశ్విన్ ఔట్ అయిన తర్వాత జడేజా కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఫోర్లతో 160 బంతుల్లో జడ్డూ భాయ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఆరంభం నుంచి బౌలర్లపై అధిపత్యం చెలాయించిన జడేజా మొదట 87 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత కూడా అదే దూకుడును కనబరుస్తూ సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం జడేజా తన ట్రేడ్ మార్క్లో బ్యాట్ను తిప్పుతు సంబురాలు చేసుకోవడం గమనార్హం. కాగా 27 ఓవర్లపాటు సాగిన తొలి సెషన్లో ఓ వికెట్ పడగా 111 పరుగులు వచ్చాయి.
వార్న్కు సంతాపం
రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు శుక్రవారం మృతి చెందిన దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మృతి పట్ల ఇరు జట్ల ఆటగాళ్లతోపాటు సపోర్టింగ్ స్టాఫ్ సంతాపం పాటించారు. షేన్వార్న్కు మృతికి సంతాపంగా ఒక నిముషం పాటు మౌనం పాటించారు. అనంతరం మ్యాచ్ ప్రారంభించారు. అలాగే ఆటగాళ్లంతా చేతులకు నల్ల బ్యాడ్జ్లను ధరించి మ్యాచ్ ఆడుతున్నారు.

తొలి రోజు ఆట
కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 6 వికెట్లకు 357 పరుగులు చేసింది. తొలి రోజు ఆటలో రిషభ్ పంత్(97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 96) తృటిలో శతకాన్ని చేజార్చుకోగా.. హనుమ విహారి(128 బంతుల్లో 5 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. 100వ టెస్ట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ(45) మరోసారి సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా రెండు వికెట్లు తీయగా.. సురంగ, విష్వా, లాహిరు, ధనంజయ డిసిల్వా తలో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications












