
అత్యధిక స్కోర్ 375:
ప్రేమదాస స్టేడియం పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలం. ఇక్కడ ఎప్పుడైనా భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఇదే మైదానంలో 2017లో జరిగిన ఓ వన్డే మ్యాచ్లో భారత్ 5 వికెట్ల నష్టానికి 375 రన్స్ చేసింది. భారత్-శ్రీలంక మధ్య రేపు జరిగే మ్యాచ్ 131వది. ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 71 మ్యాచ్లు గెలిచాయి. చేజింగ్ చేసిన జట్లు 50 సార్లు గెలుపొందాయి. 10 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఇక్కడ అత్యధిక వ్యక్తిగత స్కోరు 169. 2013లో కుమార సంగక్కర దక్షిణాఫ్రికాపై ఈ స్కోర్ చేశాడు.

అత్యధిక ఛేజింగ్ 288:
ప్రేమదాస స్టేడియంలో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు ఏంజెలో మాథ్యూస్ నమోదుచేశాడు. 2009లో టీమిండియాపై 20 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ అత్యధిక జట్టు స్కోరు 375/5. 2017లో శ్రీలంకపైనే భారత్ చేసింది. అత్యల్ప జట్టు స్కోరు 86 (2002, నెదర్లాండ్స్ vs శ్రీలంక). 288 పరుగులే ఇక్కడ అత్యధిక ఛేజింగ్ (భారత్ vs శ్రీలంక-2012). 2017లో ఇక్కడ భారత్-శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచులో కోహ్లీసేన విజయం సాధించింది. ప్రేమదాస స్టేడియంలో వన్డేల్లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 235. 300 స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఈ ట్రాక్లో ఇరు జట్లు మొదట బ్యాటింగ్ చేయడానికి చూస్తాయి. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ వికెట్ బ్యాటింగ్కు కాస్త కష్టమవుతుంది. వర్ష సూచనలు లేవు.

91 మ్యాచుల్లో విజయం:
భారత్-శ్రీలంక జట్లు 1979 నుంచి వన్డేల్లో తలపడుతున్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు 150కి పైగా వన్డేల్లో ముఖాముఖీ తలపడ్డాయి. ద్వైపాక్షిక సిరీస్లలో కాకుండా ఇరు జట్లు ఐసీసీ, వన్డే ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్లలో తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన పోరులో భారత్దే పైచేయిగా ఉంది. శ్రీలంకపై భారత్ ఇప్పటి వరకు 91 మ్యాచుల్లో విజయం సాధిస్తే, భారత జట్టుపై శ్రీలంక 56 సార్లు గెలుపొందింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఫలితం తేలనివి 11 మ్యాచ్లు. శ్రీలంకపై భారత జట్టు అత్యధిక స్కోరు 414/7. 2009తో రాజ్కోట్లో జరిగిన మ్యాచ్లో భారత్ ఈ స్కోరు సాధించింది. అదే మ్యాచ్లో శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది.

54 పరుగులు మాత్రమే:
షార్జాలో 2000వ సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 54 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యల్పం. శ్రీలంక 1984లో షార్జాలో, 2013లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో 96 పరుగులు చేసింది. ఆ జట్టుకు భారత్పై అదే అత్యల్పం. 2003లో జొహన్నెస్బర్గ్లో శ్రీలంకపై భారత జట్టు 183 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2000వ సంవత్సరంలో భారత జట్టుపై శ్రీలంక 245 పరుగుల తేడాతో గెలుపొందింది. సనత్ జయసూర్య 189 పరుగుల అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించగా, రోహిత్ శర్మ ఏకంగా 264 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications












