హైదరాబాద్: ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడమే మూడో వన్డే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ 'శ్రీలంక బ్యాట్స్మెన్ ఆ జట్టుని అప్పటికే మెరుగైన స్థితిలో నిలిపారు. దీంతో మిడిలార్డర్లో కచ్చితంగా వికెట్లు తీయాలని మేము అనుకున్నాం. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో నేను రెండు కీలక వికెట్లు తీశాను. ఆ ఓవరే మ్యాచ్ని భారత్వైపు తిప్పింది' అని అన్నాడు.
'విశాఖపట్నం పిచ్ స్పిన్నర్లకి బాగా అనుకూలించింది. పిచ్ నుంచి మేము ఊహించినదానికంటే ఎక్కువ టర్న్ లభించడంతో మా పని సులువైంది. మ్యాచ్లో బౌలింగ్ లెంత్పైనే దృష్టి సారించా. ఇదంతా ప్రిపరేషన్లో భాగమే. మ్యాచ్లో ఆడుకున్నా నెట్ ప్రాక్టీస్లో హార్డ్ వర్క్ చేయాలి. తుది జట్టులో అవకాశం లభిస్తే నిరూపించుకోవాలి' అని కుల్దీప్ వివరించాడు.
ఆదివారం జరిగిన చివరి వన్డే మ్యాచ్ 28వ ఓవర్లోనే మ్యాచ్ కీలక మలుపు తిరిగిందని క్రికెట్ విశ్లేషకులు సైతం అంటున్నారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఓపెనర్ ఉపుల్ తరంగ (95) దూకుడగా ఆడటంతో 27 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 160/2 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది.
ఈ సమయంలో 28వ ఓవర్ వేసిన కుల్దీప్ లంకను ఘోరంగా దెబ్బతీశాడు. ఆ ఓవర్ మొదటి బంతికే సెంచరీ దిశగా సాగుతున్న ఉపుల్ తరంగ ఔటవగా.. ఐదో బంతికి డిక్వెల్లా (8) స్లిప్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం శ్రీలంక జట్టు ఒక్కసారిగా ఒత్తిడిలో పడి మిగతా వికెట్లను చేజార్చుకుంది.
దీంతో ఆ జట్టు 215 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 32.1 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.