క్యాండీ: అయిదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ - శ్రీలంకల మధ్య ఆదివారం మూడో వన్డే జరిగింది. ఈ వన్డేలో భారత్ గెలవడంతో పాటు 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో మహేంద్ర సింగ్ ధోని మైదానంలో నిద్రపోయాడు. దీనికి కారణం ఉంది.
లక్ష్యానికి భారత్ చేరువలో ఉన్న సమయంలో ఓటమిని జీర్ణించుకోలేని శ్రీలంక అభిమానులు స్టేడియంలోకి వాటర్ బాటిల్స్ విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అంపైర్లు మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు.

44వ ఓవర్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో రోహిత్ శర్మ 122, ధోని 61 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అప్పటికే బాగా అలసిపోయిన ధోని విరామం దొరకడంతో హెల్మెట్, గ్లౌజులు తొలగించి క్రీజులో బోర్లా పడుకుని విశ్రాంతి తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.