హైదరాబాద్: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్పై టీమిండియా మాజీ కెప్టెన్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. 'శ్రీలంక సిరీస్లో ధోని ఆటను ఎమ్మెస్కే ప్రసాద్ చూస్తున్నావా? మరో అద్భుతమైన ఇన్నింగ్స్' అంటూ సోషల్ మీడియాలో ఎమ్మెస్కేని ప్రశ్నిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
శ్రీలంక పర్యటనకు గాను టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్కి సెలక్టర్లు మొండిచేయి చూపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యువీ భారత జెర్సీ ధరించడం కష్టమేనన్న వార్తలు వెలుగు చూశాయి. ఈ వార్తలపై స్పందించిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, యువీకి విశ్రాంతి మాత్రమే కల్పించామని చెప్పాడు.

అంతేకాదు జట్టు ఎంపిక సందర్భంగా యువీ, ధోనీ గురించి చర్చించామని అన్నారు. మరోవైపు శ్రీలంక పర్యటనలో ఆశించిన మేరకు ప్రదర్శన చేయకపోతే ధోనికి తగిన ప్రత్యామ్నాయం చూడక తప్పదని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ధోని అభిమానులు ఎమ్మెస్కేపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు.
శ్రీలంకతో రెండో వన్డేలో భువనేశ్వర్ కుమార్తో, మూడో వన్డేలో రోహిత్శర్మతో కలిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు రెండు వన్డేల్లో నాటౌట్ గా నిలిచి అరుదైన రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. లక్ష్య ఛేదనలో నాటౌట్గా నిలిచి జట్టుకి విజయాలు అందించిన ఆటగాళ్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో నిలిచాడు.
ఇప్పటి వరకు 299 వన్డేలు ఆడిన ధోని మొత్తం 121సార్లు నాటౌట్గా నిలిచాడు. దీంతో పాటు లక్ష్య ఛేదనలో ధోని 40 సార్లు నాటౌట్గా నిలిచి చరిత్ర రికార్డు సృష్టించాడు. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికాకు చెందిన జాంటీ రోడ్స్(33), పాకిస్థాన్కు చెందిన ఇంజమామ్ ఉల్హాక్(32), ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్(31)లు ఉన్నారు.