
మోహాలీ: భారత్, శ్రీలంక మధ్య ఈ నెల 4 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో మొహాలీలో భారత్ రికార్డులను ఒక సారి పరిశీలిద్దాం. టెస్ట్ ఫార్మాట్లో మొహాలీలో భారత్కు మంచి రికార్డులే ఉన్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 13 టెస్టు మ్యాచ్లు ఆడిన ఇండియా 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 5 మ్యాచ్లు డ్రా కాగా, ఒకటి ఓడిపోయింది. మొహాలీలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన రికార్డు టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరు మీద ఉంది. మొహాలీలో అరంగేట్ర మ్యాచ్లోనే ధావన్ 187 పరుగులతో చెలరేగాడు. ఇక అత్యధిక వ్యక్తిగత బౌలింగ్ రికార్డు న్యూజిలాండ్ బౌలర్ డియోన్ నాష్ పేరు మీద ఉంది. అతని గణాంకాలు 6-27గా ఉన్నాయి.
మొహాలీ మైదానంలో టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. ఈ మైదానంలో 11 టెస్ట్ మ్యాచ్లు ఆడిన సచిన్ 47 సగటుతో 767 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక అత్యధిక వికెట్ల రికార్డు టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరు మీద ఉంది. ఈ మైదానంలో 7 మ్యాచ్లు ఆడిన కుంబ్లే 36 వికెట్లు తీశాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ఈ మైదానంలో మంచి రికార్డులు ఉన్నాయి. ఇక్కడ 3 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అశ్విన్ 16 వికెట్లు తీశాడు.
ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ల్లో ఇండియాదే పూర్తి అధిపత్యం ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 44 టెస్టు మ్యాచ్ల్లో తలపడగా భారత్ అత్యధికంగా 20 మ్యాచ్ల్లో గెలిచింది. శ్రీలంక 7 టెస్టు మ్యాచ్ల్లో గెలిచింది. ఇక 17 టెస్ట్ మ్యాచ్లు ఫలితం తేలకుండానే డ్రాగా ముగిశాయి. స్వదేశంలో భారత్ 11 టెస్టు మ్యాచ్లు గెలవగా శ్రీలంకలో 9 గెలిచింది. ఇక శ్రీలంక విషయానికొస్తే స్వదేశంలో 7 టెస్ట్ మ్యాచ్లు గెలిచిన ఆ జట్టు ఇప్పటివరకు భారత్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. శ్రీలంకలో కూడా ఆ జట్టు కంటే టీమిండియానే ఎక్కువ టెస్టు మ్యాచ్లు గెలవడం విశేషం. శ్రీలంకలో ఆ జట్టు 7 గెలవగా.. భారత్ 9 గెలిచింది.