హైదరాబాద్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ప్రస్తుతం చంఢీమాల్ 8, మెండిస్ 16 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీశాడు.
అంతకముందు రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్లు కోల్పోయి 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో రెండో టెస్టులో కూడా టీమిండియా పట్టు బిగించినట్లు అయింది.
పుజారా (133), రహానే (132) సెంచరీలు చేయగా, జడేజా (70 నాటౌట్), సాహా (67), కేఎల్ రాహుల్ (57), అశ్విన్ (54)లు హాఫ్ సెంచరీలు చేశారు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో 600 పరుగులు చేసిన కోహ్లీసేన ఇప్పుడు ఆ స్కోరుని అధిగమించింది. లంక బౌలర్లలో హెరాత్ 4, పుష్పకుమార 2 వికెట్లు తీసుకున్నారు.
హాఫ్ సెంచరీ చేసిన వృద్ధిమాన్ సాహా
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అశ్విన్, సాహా రాణించడంతో భారత్ భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. వృద్ధిమాన్ సాహా 50 పరుగులు పూర్తి చేశాడు. గాలే టెస్టులో చెలరేగి ఆడిన పాండ్యా నిరాశపరిచాడు.
శుక్రవారం రెండో సెషన్ ముగిసే సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 553 పరుగులు చేసింది.
రెండో సెషన్లో భారత్ దూకుడుగా ఆడింది. 30 ఓవర్లు ఆడిన భారత్ 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. పాండ్యా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా స్కోరు బోర్డును పరిగెత్తించాడు. సాహా-జడేజాల జోడీ 8వ వికెట్కి 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 150 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 553 పరుగులు చేసింది.
హాఫ్ సెంచరీ అనంతరం అవుటైన అశ్విన్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఏడో వికెట్ కోల్పపోయింది. లంచ్ విరామం అనంతరం అర్ధసెంచరీ చేసిన అశ్విన్ ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. 121.4వ ఓవర్లో హెరాత్ వేసిన బంతిని ఎదుర్కొన్న అశ్విన్ ఆ బంతిని సిక్స్లా మలిచి కెరీర్లో 11వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
తద్వారా టెస్టుల్లో రెండు వేల పరుగుల క్లబ్లో చేరాడు. ఆ తర్వాతి బంతికే అశ్విన్ అవుటై అభిమానులను నిరాశపరిచాడు. 121.5వ ఓవర్లో హెరాత్ వేసిన బంతి నేరుగా వెళ్లి వికెట్లను తాకడంతో జట్టు స్కోరు 451 వద్ద అశ్విన్ పెవిలియన్కు చేరాడు. 127 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 470 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సాహా(34), హార్డిక్ పాండ్యా(3) ఉన్నారు.
లంచ్ విరామానికి భారత్ 442/5
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో రోజైన లంచ్ విరామ సమయానికి భారత్ 5 వికెట్లకు 442 పరుగులు చేసింది. అశ్విన్ 47, సాహా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
శుక్రవారం ఉదయం పుజారా (133), రహానే (132) పరుగుల వద్ద అవుటైన ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్, వృద్ధిమాన్ సాహాలు స్కోరు బోర్డుని పరిగెత్తించారు. రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే కరుణరత్నె బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పుజారా పెవిలియన్కు చేరాడు.

పుజారా స్థానంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్.. రహానెకి జత కలిశాడు. ఇద్దరూ కలిసి వీలు చిక్కినప్పుడల్లా పరుగులు రాబడుతూ స్కోరు బోర్డును కదిలించారు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్కి 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత కాసేపటికే రహానే కూడా అవుటయ్యాడు.
ఓవర్నైట్ స్కోరుకు పుజారా 5 పరుగులు జోడించగా, రహానే 29 పరుగులు జోడించాడు. రెండో రోజు తొలి సెషన్లో 30 ఓవర్లు ఆడిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి 3.27 రన్రేటుతో 98 పరుగులు సాధించింది.
రెండో రోజు ప్రారంభమైన ఆట
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. 344/3 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే శుక్రవారం ఆదిలోనే భారత్కు ఎదురు దెబ్బ తగిలింది.
రెండో రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి సెంచరీతో కదం తొక్కిన ఛటేశ్వర్ పుజారా 133 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 92వ ఓవర్లో కరుణరత్నే వేసిన ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేరాడు. ఇప్పటి వరకు 40 టెస్టులాడిన కరుణరత్నేకు ఇదే తొలి వికెట్ కావడం విశేషం.

తన కెరీర్లో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న పుజారా ఈ టెస్టులో సెంచరీ చేయడం ద్వారా యాభై టెస్టులో సెంచరీ సాధించిన ఏడో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మొత్తంగా చూస్తే 36 ఆటగాడిగా పుజారా నిలిచాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టులో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతూ శతకం బాదిన క్రికెటర్లు ఆరుగురు మాత్రమే.
1961లో పాలి ఉమ్రిగర్ తొలిసారి 50వ టెస్టులో సెంచరీ సాధించగా 1979లో గుండప్ప విశ్వనాథ్, 1983లో కపిల్ దేవ్, 2004లో వీవీఎస్ లక్ష్మణ్, 2016లో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే ఈ అరుదైన ఘనత అందుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పుజారా చేరాడు.
94 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానె 106, అశ్విన్ 8 పరుగులతో ఉన్నారు.