హైదరాబాద్: వైరల్ ఫీవర్ కారణంగా లంకతో జరిగిన తొలి టెస్టుకు దూరమైన రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కొలంబో వేదికగా జరగనున్న రెండో టెస్టుకి ఫిట్నెస్ సాధించాడు. దీంతో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో కేఎల్ రాహుల్ ఆడుతున్నట్లు కెప్టెన్ కోహ్లీ స్పష్టం చేశాడు.
రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. దీంతో కొలంబో టెస్టులో కేఎల్ రాహుల్ తుది దట్టులో ఉంటాడని కోహ్లీ పేర్కొన్నాడు. 'రాహుల్ జట్టులోకి చేరాడు. అతనితో కలిసి శిఖర్ ధావన్, అభినవ్ ముకుంద్ల్లో ఒకరు ఆడతారు' అని కోహ్లీ అన్నాడు.

'గత రెండేళ్లలో రాహుల్ చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. కొన్ని సీజన్ల నుంచి రాహుల్ ప్రదర్శనలో నిలకడ పెరిగింది. ప్రస్తుత భారత టెస్టు జట్టులో రాహుల్ కీలక ఓపెనర్. శ్రీలంకతో జరిగే రెండో టెస్టులో రాహుల్ ఆడతాడు' అని కోహ్లీ స్పష్టం చేశాడు. కొలంబో పిచ్పై పచ్చిక ఎక్కువగా ఉందని చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను ఆడించే సంగతి ఇప్పుడే చెప్పలేమని కోహ్లీ అన్నాడు.
జట్టులో ఎవరెవరు ఉంటారో ముందే వెల్లడిస్తే ప్రత్యర్థికి ఆశ్చర్యంగా ఉండదని చెప్పాడు. పిచ్పై ఫలితం వచ్చే అవకాశాలున్నాయని అది తమలో ఉత్సాహం నింపుతోందని కోహ్లీ పేర్కొన్నాడు. అయితే కేఎల్ రాహుల్తో ధావన్, ముకుంద్లలో ఎవరు ఓపెనింగ్ బరిలోకి దిగుతారనే విషయమై కోహ్లీ స్పష్టత ఇవ్వలేదు.
గాలే టెస్టుకి వైరల్ ఫీవర్ కారణంగా కేఎల్ రాహుల్ దూరమవ్వడంతో అతడి స్ధానంలో అభినవ్ ముకుంద్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్లో ధావన్ 190 పరుగులతో సెంచరీతో రాణించగా, రెండో ఇన్నింగ్స్లో అభినవ్ ముకుంద్ 81 పరుగులు చేశాడు. దీంతో అభినవ్ ముకుంద్ని తప్పించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.