భారత టీ20 క్రికెట్లో కొత్త శకం మొదలుకానుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో పొట్టి ఫార్మాట్ జట్టు బాధ్యతలు సూర్యకుమార్ యాదవ్ అందుకున్నాడు. జులై 27 నుంచి ప్రారంభంకానున్న శ్రీలంక పర్యటనతో సూర్య తన యాక్షన్ మొదలుపెట్టనున్నాడు. మొన్నటివరకు రోహిత్ తర్వాత హార్దిక్ పాండ్యనే భారత కెప్టెన్ అవుతాడని భావించారంతా. కానీ నయా కోచ్గా గౌతమ్ గంభీర్ రాక, హార్దిక్ ఫిట్నెస్ సమస్యలతో అంచనాలు తలకిందులయ్యాయి.
ఆలస్యంగా 30 ఏళ్ల వయసులో భారత క్రికెట్లో అడుగుపెట్టిన సూర్య మూడేళ్లలోనే టీ20 జట్టు సారథిగా ఎంపికవ్వడం విశేషం. అయితే టీ20 ఫార్మాట్లో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డులు గొప్పగా ఉన్నాయి. సారథిగా ధోనీ విజయాల జోరును ఏ మాత్రం తగ్గకుండా కోహ్లి సంచలనాలు సృష్టించాడు. కోహ్లి తర్వాత బాధ్యతలు అందుకున్న రోహిత్ జట్టును విజయాలతో హోరెత్తించాడు. ఇప్పుడు సూర్య హిట్ కెప్టెన్సీని ఎలా కొనసాగిస్తాడో అనే ఆసక్తి పెరిగింది.

అయితే సారథిగా బాధ్యతలు నిర్వర్తించడం కష్టమేమి కాదని కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఆటగాళ్లతో పరిచయం ఉండటంతో వాళ్ల బలాబలాల తనకి తెలుసు అని తెలిపాడు. డిఫ్రెంట్గా ట్రై చేయకుండా సింపుల్గా ఉంటే సరిపోతుందని పేర్కొన్నాడు. ''ఈ కొత్త బాధ్యతలను ఆస్వాదిస్తాను. మేం అంతా కలిసి ఎంతో సమయాన్నిగడిపాం. కలిసి ఎంతో క్రికెట్ ఆడాం. ఫ్రాంచైజీ, దేశవాళీ క్రికెట్లో ఆడాం. కాబట్టి ఆటగాళ్ల బలాలు, బలహీనతలు తెలుసుకోవడం కష్టమేమి కాదు. మైదానంలో అవతల కూడా ప్లేయర్లతో అనుబంధం ఉంది''
''అన్ని విషయాలు చాలా సింపుల్గా ఉండేలా ప్రయత్నిస్తాను. ప్రక్రియను ఎక్కువగా నమ్మే వ్యక్తిని. జట్టులోని ఆటగాళ్లకు కూడా సింపుల్గా ఉండమనే చెప్తాను. భిన్నంగా ప్రయత్నించకుండా సరళంగా, సహజసిద్ధంగానే ఉండటానికి ప్రయత్నించాలని సహచరులకు సూచిస్తాను'' అని సూర్యకుమార్ పేర్కొన్నాడు. కాగా, సూర్య గతంలో కూడా భారత్కు కెప్టెన్సీ వహించాడు. రోహిత్, హార్దిక్ గైర్హాజరీలో టీ20 జట్టును నడిపించాడు. గతేడాది నవంబరులో సూర్య సారథ్యంతో భారత్ ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ను 4-1తో గెలుచుకుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్ను 1-1తో డ్రాగా ముగించింది.
శ్రీలంక పర్యటనకు ఎంపికైన టీమిండియా టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.