హైదరాబాద్: గత 20 ఏళ్లలో భారత్లో ఒక్క ద్వైపాక్షిక సిరీస్ను శ్రీలంక జట్టు గెలవని సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మూడు వన్డేల సిరిస్లో విజయం సాధించి ఆ నిరీక్షణకు తెరదించాలని చూస్తోంది. అందుకు గాను శ్రీలంకకు విశాఖ వన్డే రూపంలో ఓ చక్కటి అవకాశం వచ్చింది.
అయితే తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. నిజానికి వైజాగ్లో ఇప్పటి వరకు భారత్ 6 వన్డేలు ఆడగా అందులో ఐదింటిలో విజయం సాధించింది. ఇలాంటి పిచ్పై భారత్ను లంక ఓడించడం అంత సులభం కాదేమో అనిపిస్తోంది.
మరోవైపు ఈ ఏడాది 27 వన్డేలు ఆడిన శ్రీలంక కేవలం ఐదింట మాత్రమే గెలవడం మరో విశేషం. భారత పర్యటనకు శ్రీలంక రావడానికి ముందు ఆ జట్టుపై పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు. ఈ పర్యటనలో భారత జట్టే ఫేవరేట్గా బరిలోకి దిగింది. అయితే కోల్ కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంక గట్టి పోటి ఇచ్చింది.
దీంతో శ్రీలంక జట్టు పుంజుకుందని, ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆ జట్టు ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో రెండో టెస్టులో శ్రీలంక ఘోర ఓటమి పాలైంది. ఇక మూడో టెస్టును కష్టపడి డ్రా చేసుకున్నారు.
టెస్టు సిరిస్ అనంతరం మూడు వన్డేల సిరిస్ ప్రారంభమైంది. తొలి వన్డేలో లంక ఆటగాళ్లు భారత్కు షాకిచ్చారు. ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్పై అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో మరోసారి శ్రీలంకపై గాడిలో పడిందంటూ క్రికెట్ విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు.
అయితే రెండో వన్డేలో భారత్ చెలరేగిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా ఆడి తన కెరీర్లో మూడో డబుల్ సెంచరీని సాధించాడు. దీంతో లంకపై భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక సిరిస్ ఫలితాన్ని తేల్చే విశాఖ వన్డేలో టాస్ గెలిచిన భారత్... లంకను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.