ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం
కాగా శ్రీలంకతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు తొలి వికెట్కు ఏకంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ వరుసగా ఫోర్లు, సిక్సులతో స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో చమిక కరుణరత్నే బౌలింగ్లో ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ ఫోర్లతో అదరగొట్టాడు. అదే దూకుడును కొనసాగించిన కిషన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.
రెండు వికెట్లు డౌన్
జట్టు స్కోర్ 111 పరుగుల వద్ద ఉండగా రోహిత్ శర్మ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 12వ ఓవర్లో 32 బంతుల్లో 44 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను లహిరు కుమార బౌల్డ్ చేశారు. అనంతరం శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇషాన్ కిషన్ టీమిండియా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో వీరిద్దరు రెండో వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 56 బంతుల్లోనే 89 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 155 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
అయ్యర్ హాఫ్ సెంచరీ
ఈ క్రమంలో రవీంద్ర జడేజాతో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. అలాగే అజేయంగా 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టీమిండియా 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో లంక ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో 25 బంతుల్లోనే శ్రేయస్ అయ్యర్ కెరీర్లో నాల్గో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 5 ఫోర్లు, 2 సిక్సులతో 28 బంతుల్లోనే 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జడేజా కూడా 3 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ దూకుడుతో చివరి 3 ఓవర్లలోనే టీమిండియా 44 పరుగులు చేసింది.
రోహిత్ రికార్డు
శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన గుప్తిల్ (3299) రికార్డును హిట్మ్యాన్ బద్ధలు కొట్టాడు. ఆ రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. శ్రీలంక బౌలర్ జెఫ్రీ వాండర్సే వేసిన తొమ్మిదో ఓవర్ చివరి బంతిని సింగిల్ తీయడం ద్వారా రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు. కాగా టీ20 ఫార్మాట్లో హిట్మ్యాన్ ఇప్పటివరకు 3307 పరుగులు చేశాడు.
చెలరేగిన ఇషాన్ కిషన్
ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ చెలరేగాడు. 10 ఫోర్లు, 3 సిక్సులతో 56 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. టీ20 కెరీర్లో కిషన్కు ఇది రెండో హాఫ్ సెంచరీ. ఆరంభం నుంచే కిషన్ దూకుడుగా ఆడాడు. ఏకంగా రెండు సార్లు హాట్రిక్ ఫోర్లు బాదాడు. చమిక కరుణరత్నే వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో, లాహిర్ కుమార వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రీలంక బౌలర్లు క్యాచ్ వదిలేయడంతో దానిని ఉపయోగించుకున్న కిషన్ భారీ ఇన్నింగ్స్తో సత్తా చాటాడు.


Click it and Unblock the Notifications
