
పూణే: చివరిదైన కీలక మూడో టీ20 ముందు శ్రీలంక క్రికెట్ జట్టుకి భారీ షాక్ తగిలింది. శ్రీలంక స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇసురు ఉదాన గాయం కారణంగా మూడో టీ20 నుండి తప్పుకున్నాడు. మూడో టీ20లో ఉదాన ఆడే అవకాశం లేదని శ్రీలంక ప్రధాన కోచ్ మిక్కీ ఆర్థర్ కూడా ఓ ప్రకటనలో తెలిపాడు. ఇండోర్ వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో టీ20 మ్యాచ్లో లంక ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్లో లంక 0-1తో వెనుకపడింది.
రెండో టీ20 మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన లంక 142 పరుగులు చేసి.. టీమిండియా ముందు 143 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో లంక బౌలర్లు ప్రాక్టీస్ చేశారు. పేసర్ ఇసురు ఉదాన కూడా వార్మప్ సెషన్లో పాల్గొనగా.. అతడు గాయపడ్డాడు. దీంతో ఉదాన ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. ఉదాన వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడుతుండంతో.. మూడో టీ20 నుండి తప్పుకున్నాడు. ఇప్పటికే సిరీస్లో వెనకబడిన లంకకు.. ఉదాన కూడా దూరమవడం ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఉదాన బ్యాటింగ్లో 2 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి ఔటయ్యాడు. రెండో టీ20లో లంక ఓటమికి ఉదాన గాయంతో బౌలింగ్కి దూరంగా ఉండటం కూడా ఓ కారణమని కెప్టెన్ లసిత్ మలింగ అన్నాడు. 'మేము 25-30 పరుగులు తక్కువగా చేసాం. లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాం. 18వ ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకువచ్చాం. మా ప్రధాన బౌలర్ ఉదాన గాయం కారణంగా బౌలింగ్ చేయలేదు. ఇది కూడా మా ఓటమికి ఓ కారణం' అని మలింగ చెప్పుకొచ్చాడు.
మంగళవారం హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యంను భారత్ మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లోనే ఛేదించింది. సిరీస్లో మిగిలిన మూడో టీ20 మ్యాచ్ పుణె వేదికగా శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే పూణే చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు.. ఈరోజు విశ్రాంతి తీసుకుని గురువారం ప్రాక్టీస్ చేయనున్నారు.