
అర్ధరాత్రి అస్వస్థత
శనివారం మ్యాచ్ కారణంగా గాయపడిన ఇషాన్ కిషన్ అర్దరాత్రి అస్వస్థకు గురి కావడంతో అతడిని హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో గల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో వైద్యులు ఇషాన్ కిషన్కు సిటీ స్కానింగ్ చేశారు. అవసరమైన వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించారు. అనంతరం ఇషాన్ కిషన్ కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం కిషన్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

అసలు ఏం జరిగిందంటే..
శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా 184 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగింది. శ్రీలంక పేసర్ లాహిరు కుమార వేసిన ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ రెండో బంతి ఇషాన్ కిషన్ హెల్మెట్ను బలంగా తాకింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన రాకాసి బౌన్సర్ను ఇషాన్.. తన ఫేవరేట్ పుల్ షాట్గా ఆడుదామని ప్రయత్నించాడు. కానీ బ్యాట్ అడ్వాన్స్ అవ్వడంతో బంతి అతని తలకు బలంగా తాకింది.

ఆ తర్వాతి ఓవర్లోనే ఔట్
దాంతో ఇషాన్ కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే టీమిండియా ఫిజియో వచ్చి పరీక్షించాడు. అంతా బాగానే ఉందని చెప్పి ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించగా.. అతను ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. బంతి తాకిన ఎఫెక్ట్ ఏమో కానీ లాహీరు వేసిన మరుసటి ఓవర్లోనే సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో కిషన్ 16 పరుగులు మాత్రమే చేశాడు. గతంలో ఇతర ఆటగాళ్లకు తాకిన మాదిరే ఇషాన్ కిషన్కు కూడా బంతి తాకిందని అంతా భావించారు. కానీ అర్ధరాత్రి గాయం ఎఫెక్టు చూపించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఓపెనర్గా మయాంక అగర్వాల్
ఇషాన్ కిషన్ దూరమవడంతో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వికెట్ కీపింగ్ బాధ్యతలను ఇప్పటికే జట్టులో ఉన్న సంజూ శాంసన్ చేపట్టడం ఖాయమనే చెప్పుకోవాలి.

భారత్ విజయం
ఇక రెండో టీ20 మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్ నిసాంకా (53 బంతుల్లో 11 ఫోర్లతో 75) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 38) రాణించాడు. చివర్లో డసన్ షనక (19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 47 నాటౌట్) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది. అనంతరం భారత్ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 74 నాటౌట్), జడేజా (18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 45 నాటౌట్), శాంసన్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 39) మెరుపు ఇన్నింగ్స్లు జట్టును గెలిపించాయి.


Click it and Unblock the Notifications
