కోచ్గా తన సరికొత్త కెరీర్ అదిరేలా ఆరంభించాలని శ్రీలంక పర్యటనను గౌతమ్ గంభీర్ చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్గా గంభీర్ ఎంపికైన విషయం తెలిసిందే. జులై 27వ తేదీ నుంచి మొదలుకానున్న లంక పర్యటనతో గంభీర్ తన యాక్షన్ మొదలుపెట్టనున్నాడు.
అయితే శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్లనే లక్ష్యంగా కాకుండా గంభీర్ సుదీర్ఘ ప్రణాళికలు వేస్తున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పు సిద్ధం చేయాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో నయా కోచ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాడు.

విశ్రాంతి పేరుతో కొన్ని సిరీస్లకు ఆటగాళ్లు దూరం అయ్యే పద్ధతిని గంభీర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. పనిభారం దృష్ట్యా స్టార్ క్రికెటర్లకు ప్రత్యేక విశ్రాంతి ఇవ్వాలని అతను భావించట్లేదు. దీంతో టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలను శ్రీలంక వన్డే సిరీస్కు ఎంపిక చేయాలని గంభీర్ యోచిస్తున్నాడు. వాళ్లతో పాటు జస్ప్రీత్ బుమ్రాను జట్టులో కొనసాగించాలని చూస్తున్నాడు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం దాదారు ఆరు వారాల సమయం దొరికిందని, ఏ ఆటగాడికైనా ఈ విరామం సరిపోతుందని గంభీర్ భావిస్తున్నాడు. ప్లేయర్లందరూ అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండాలని, గాయమైతే కోలుకుని తిరిగి జట్టులో చేరాలని గంభీర్ ఇప్పటికే పేర్కొన్నాడు. జూన్ 29న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. వచ్చే నెల 4వ తేదీన శ్రీలంక వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.
మరోవైపు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ నుంచి భారత జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ను తిరిగి టీ20, వన్డే జట్టులో చేర్చాలని గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేగాక లంకతో టీ20 సిరీస్కు రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో హార్దిక్ పాండ్య దూరమయ్యే పరిస్థితులు ఉండటంతో రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవడం దాదాపు ఖాయమనిపిస్తుంది. మరో రెండు రోజుల్లో శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది.