హైదరాబాద్: అవకాశాలు అన్ని వేళలా రావు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా భారత జట్టులో చోటు దక్కించుకోవడం అంటే ఆషామాషీ కాదు. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్కి జ్వరం రావడంతో అతడి స్ధానంలో గాలే టెస్టులో అభినవ్ ముకుంద్కి చోటు దక్కింది.
అయితే తనకు అందివచ్చిన అవకాశాన్ని అభినవ్ ముకుంద్ సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య గాలే వేదికగా బుధవారం తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో ఓపెనర్గా బరిలోకి దిగిన అభినవ్ ముకుంద్ 12 పరుగుల వద్ద అవుటయ్యాడు.
పిచ్ బ్యాటింగ్కు ఎంతో సహకరిస్తున్న వేళ, అనవసరపు షాట్ ఆడి ముకుంద్ విఫలం కావడంపై క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. అభినవ్ ముకుంద్ని టెస్టు జట్టులోకి తీసుకోవడం వృధా అని, అతడు దేశవాళీ క్రికెట్ అడుకునేందుకే పనికొస్తాడని ఎద్దేవా చేస్తున్నారు.

గాలే టెస్టుతో టెస్టు కెరీర్ను ముగించాలని విమర్శలు గుప్పిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక పోయిన ముకుంద్కు మరోసారి అవకాశం ఇవ్వవద్దని సూచిస్తున్నారు. ముకుంద్ కంటే మంచి ఓపెనర్లు ఎంతో మంది క్యూలో ఉన్నారని ఒక అభిమాని విమర్శించాడు.
శ్రీలంక జాతీయగీతం సాగినంత సేపు కూడా ముకుంద్ క్యూలో నిలుచోలేకపోయాడని మరొకరు అనగా, పలుమార్లు విఫలమైనా, ఎందుకు అభినవ్కు అవకాశం ఇస్తున్నారని ఇంకొకరు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.