శ్రీలంక పర్యటనలో భారత్ టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్ను 2-0తో సాధించింది. పల్లెకెలె వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఏడు వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. అయితే ఎదుర్కొన్న తొలి బంతికే సంజు శాంసన్ క్లీన్బౌల్డ్ అయ్యాడు.
మెడనొప్పి కారణంతో శుభ్మన్ గిల్ రెండో టీ20కు దూరమవ్వడంతో సంజు శాంసన్కు తుదిజట్టులో అవకాశం వచ్చింది. అయితే శాంసన్ను ఓపెనర్గా పంపించారు. వర్షం కారణంగా లక్ష్యాన్ని 8 ఓవర్లకు 78 పరుగులుగా కుదించడంతో.. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలనుకున్న సంజు శాంసన్ తీక్షణ బౌలింగ్లో ఔటయ్యాడు.

గోల్డెన్ డకౌటవ్వడంతో శాంసన్పై నెట్టింట్లో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అవకాశం ఇచ్చిన శాంసన్ సద్వినియోగం చేసుకోవట్లేదని కామెంట్లు చేస్తున్నారు. జట్టులోకి శాంసన్ రావాలని డిమాండ్ చేయడం, వచ్చిన తర్వాత అతను పేలవ ప్రదర్శన చేయడం, జట్టులో చోటు కోల్పోవడం ఓ చక్రంలా కొనసాగుతుందని వ్యంగ్యంగా అంటున్నారు.
అయితే శాంసన్ మద్దతుదారులు నెట్టింట కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. శాంసన్ జట్టు నుంచి తప్పించాలని నయా కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల జింబాబ్వే సిరీస్లో పాటు గత సిరీస్ల్లో శాంసన్ నాలుగు,అయిదు స్థానాల్లో బ్యాటింగ్ చేశాడని, కానీ తనకి రెగ్యులర్గా టచ్లో లేని ఓపెనింగ్ స్థానంలో పంపించి ఉద్దేశపూర్వకంగానే ఒత్తిడికి గురిచేశారని అంటున్నారు. శాంసన్కు అవకాశాలు ఇవ్వాలని భావిస్తే.. ఓ స్థానాన్ని ఖరారు చేసి ఛాన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవరల్లో తొమ్మిది వికెట్లకు 161 పరుగులు చేసింది. కుశాల్ పెరెరా (53; 34 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. రవి బిష్ణోయ్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్ తొలి ఓవర్కు 6/0తో ఉన్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది.
కుదించిన లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 6.3 ఓవర్లలోనే ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (30; 15 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సూర్యకుమార్ (26; 12 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), హార్దిక్ పాండ్య (22 నాటౌట్, 9 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు.