కొలంబో వేదికగా శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన భారత్- శ్రీలంక తొలి వన్డే టైగా మారింది. మందకొడి పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే (66 నాటౌట్; 65 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నిస్సాంక (56; 75 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2/33), అర్షదీప్ సింగ్ (2/47) తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనకు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (58; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. అక్షర్ పటేల్ (33; 57 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), కేఎల్ రాహుల్ (31; 43 బంతుల్లో, 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో హసరంగ (3/58), అసలంక (3/30) చెరో మూడు, వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటారు.

ఛేదనలో భారత్కు శుభారంభం దక్కింది. హిట్ మ్యాన్ చెలరేగడంతో వపర్ప్లేలో ఇండియా 71 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయింది. అక్షర్-కేఎల్ రాహుల్ భాగస్వామ్యంతో భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది. ఆఖర్లో దూబె (25; 24 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) కీలక పరుగులతో విజయ సమీకరణం 16 బంతుల్లో 5 పరుగులుగా మారింది. దూబె బౌండరీ బాది స్కోరును సమం చేశాడు.
ఇక మ్యాచ్ గెలిచేశామని డ్రెస్సింగ్ రూమ్లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత అసలంక వేసిన బంతిని దూబె ప్యాడ్లకు తాకింది. ఈ లోపు విజయానందంతో సిరాజ్ లెగ్బై రూపంలో విన్నింగ్ రన్ వచ్చిందని పరుగు తీశాడు. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లకు షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ లంక రివ్యూని కోరింది. సమీక్షలో దూబె ఔట్ అని తేలింది. ఆ తర్వాత వచ్చిన అర్షదీప్ షాట్కు యత్నించి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్కు ఊహించని ఫలితం ఎదురైంది. గెలిచే మ్యాచ్ టైగా మారింది.