హైదరాబాద్: బుధవారం శ్రీలంక-భారత్ జట్ల మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో చిన్నపాటి తప్పిదం దొర్లింది. ఈ మ్యాచ్లో శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ టాస్ గెలిస్తే కోహ్లీ టాస్ గెలిచినట్లు ప్రకటించి భారీ తప్పిదం చేశారు. ఈ మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంకపై కోహ్లీసేన 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగింది?
టాస్ వేసే క్రమంలో భారత్-శ్రీలంక జట్ల కెప్టెన్లు కోహ్లీ, ఉపుల్ తరంగ మైదానంలోకి వచ్చారు. కోహ్లీ హెడ్స్ను ఎంచుకోగానే, లంక కెప్టెన్ ఉపుల్ తరంగ కాయిన్ గాల్లోకి విసిరాడు. అది చూసిన రిఫరీ పాయ్ క్రాఫ్ట్ టైల్స్.... ఇండియా అనడంతో కోహ్లీ టాస్ గెలిచినట్లు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మురళీ కార్తీక్ ప్రకటించాడు.
ఇక్కడ రిఫరీ సరిగ్గానే చెప్పినప్పటికీ, కార్తీక్ మాత్రం సరిగా వినకపోవడంతో భారత టాస్ గెలిచినట్లయ్యింది. అయితే తప్పిదాన్ని గుర్తించేలోపే కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగిపోయింది. దీంతో చేసేదేమీ లేక ఈ విషయాన్ని అక్కడితో వదిలేశారు. రిఫరీని సరిగా అర్ధం చేసుకోవడంలో కార్తీక్ చేసిన తప్పిదం కారణంగా టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఆ మ్యాచ్ కు వర్షం పడే అవకాశం ఉండటం, అంతకుముందు వర్షం కురిసిన కారణంగా ఛేదనకు దిగే జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించి కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు ఒకవేళ టాస్ గెలిస్తే తాను కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని తరంగా చెప్పడం ఇక్కడ గమనార్హం. ఒకవేళ ఉపుల్ తరంగ తొలుత బౌలింగ్ ఎంచుకుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో!
శ్రీలంకతో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(82), మనీశ్ పాండే(51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ 9, రాహుల్ 24, ధోనీ 1 పరుగులు చేశారు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ విజయంతో కోహ్లీసేన మరో అద్భుత రికార్డుని నెలకొల్పింది. శ్రీలంకను టెస్టుల్లో 3-0తో, వన్డేల్లో 5-0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగే ఏకైక టీ20లో కూడా గెలవడంతో 9-0తో శ్రీలంకను చిత్తుచేసిన జట్టుగా ఘన చరిత్ర సాధించింది. ఇంతకు ముందు ఇలాంటి ఘనత ఆస్ట్రేలియా మాత్రమే సాధించింది.
2009-10లో పాక్ను 3-0తో టెస్టుల్లో, 5-0తో వన్డేల్లో, 1-0తో టీ20లో ఓడించింది. ఇప్పుడు శ్రీలంకపై కోహ్లీసేన సరిగ్గా అలానే విజయం సాధించింది. దీంతో టీమిండియా చరిత్రలోనే ఇది ఓ మైలురాయిగా నిలిచింది.