హైదరాబాద్: శ్రీలంక క్రికెట్ పెను సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్ను 0-3తో ఓటమిపాలై సిరిస్ను చేజార్చుకున్న శ్రీలంక జట్టుకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ చమర కపుగెదర వెన్నునొప్పి గాయం కారణంగా నాలుగో వన్డేకు దూరమయ్యాడు.
దీంతో నాలుగో వన్డేలో ఆ దేశ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. తద్వారా గత ఏడు మ్యాచ్ల్లో శ్రీలంక జట్టుకు బాధ్యతలు నిర్వహించే ఐదో కెప్టెన్గా మలింగ నిలిచాడు.

స్వదేశంలో భారత్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్లో వరుసగా తొలి రెండు వన్డేల్లో స్లో ఓవర్రేట్ నమోదుకావడంతో శ్రీలంక జట్టు రెగ్యులర్ కెప్టెన్ ఉపుల్ తరంగపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రెండు మ్యాచుల సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే.
దీంతో అతడి స్ధానంలో మూడో వన్డేలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కపుగెదర మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో వైద్య పరీక్షల అనంతరం భారత్తో జరిగే మిగతా వన్డేల్లో అతడు అందుబాటులో ఉండడని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది.
వన్డే సిరిస్కి ముందు జరిగిన టెస్టు సిరిస్లో కూడా శ్రీలంక ఇద్దరు కెప్టెన్లను మార్చిన సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో శ్రీలంక వైట్ వాష్కు గురైన సంగతి తెలిసిందే. తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ దినేశ్ చండీమాల్ గాయం కారణంగా దూరం కాగా అతడి స్ధానంలో రంగనా హెరాత్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాతి రెండు టెస్టులకు దినేశ్ చండీమాల్ సారథ్య బాధ్యతలను చేపట్టినా శ్రీలంక జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇదిలా ఉంటే రెండో వన్డేలో గాయపడిన శ్రీలంక ఓపెనర్ ధనుష్క గుణతిలక మిగతా వన్డేలకు అందుబాటులో ఉండేది లేనిది బోర్డు స్పష్టం చేయలేదు.
గుణతిలక బుధవారం ఫిట్నెస్ టెస్టులకు హాజరుకానున్నాడు. ఇదిలా ఉంటే ముందు ఆలోచనలో భాగంగా ప్రత్యామ్నాయంగా ధనుంజయ డిసిల్వా, దిల్షాన్ మునవీరాలను జట్టులోకి తీసుకున్నారు. భారత్-శ్రీలంక జట్ల మధ్య నాలుగో వన్డే కొలంబో వేదికగా గురువారం జరగనుంది.
ఇదిలా ఉంటే శ్రీలంక జట్టు వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ సనత్ జయసూర్య నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ సెలక్షన్ కమిటీ సభ్యులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. భారత్తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్లు కోల్పోవడం, అంతకు ముందు జింబాంబ్వేతో ఘోర పరాజయం, ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలోనే ఇంటికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు చీఫ్ సెలెక్టర్ జయ సూర్యతో పాటు కమిటీ సభ్యులు రంజిత్ మదురసింఘే, రమేష్ కలువితరణ, అసంక గురుసిన్హా, ఎరిక్ ఉపషంతలతో కూడిన సెలక్షన్ ప్యానెల్ భారత్తో జరిగే ఎకైక టీ20 అనంతరం తప్పుకోనున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ మోహన్ సిల్వా తెలిపారు.