
విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త. విరాట్ కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్ను వీక్షించడానికి ప్రేక్షకులను బీసీసీఐ స్టేడియంలోకి అనుమతించింది. స్టేడియం కెపాసిటీలో 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ధృవికరించింది. అలాగే బీసీసీఐ కూడా ధృవీకరించింది. విరాట్ కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా జరగదని బీసీసీఐ సెక్రటరీ జైషా ఒక ప్రకటనలో తెలిపారు. తాను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో మాట్లాడానని, ప్రస్తుత పరిస్థితుల్లో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అలాగే 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్న విరాట్ కోహ్లీకి జైషా శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీ మరిన్ని టెస్టులు ఆడాలని కోరుకుంటున్నానని, అతని వందో టెస్టు మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని జైషా చెప్పారు. అయితే కోహ్లీ వందో టెస్టు మ్యాచ్కు సంబంధించిన టికెట్లు బుధవారం నుంచే ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి.
కాగా కరోనా కారణంగా మొదట విరాట్ కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్ జరగనున్న మొహాలీ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదని బీసీసీఐ ప్రకటించింది. అదే సమయంలో బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించనున్నట్టు పేర్కొంది. దీంతో బీసీసీఐ నిర్ణయంపై విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీసీఐ పెద్దలు కావాలనే కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ విరాట్ కోహ్లీపై కక్ష్య కట్టిందని వారు ఆరోపించారు. కోహ్లీ ఇమేజీని డామేజ్ చేసేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. విరాట్ కోహ్లీ సాధిస్తున్న రికార్డులను చూసి పలువురు బీసీసీఐ పెద్దలు ఓర్వలేక పోతున్నారని అందుకే ఇలా చేస్తుతన్నారని అభిమానులు మండిపడ్డారు.
దీంతో అభిమానుల ఆగ్రహంతో బీసీసీఐ వెనక్కి తగ్గింది. 100వ టెస్టు మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించింది. కాగా భారత్, వెస్టిండీస్ మధ్య ఈ నెల 4 నుంచి మొహాలీ వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. మొహాలీ టెస్టు మ్యాచ్తో విరాట్ కోహ్లీ తన కెరీర్లో 100 టెస్టు మ్యాచ్ల మైలురాయిని చేరుకోబోతున్నాడు. దీంతో కోహ్లీ వందో టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.