శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించనట్లుగానే టీ20లకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించింది. జట్టులో కొనసాగుతున్నప్పటికీ హార్దిక్ పాండ్యకు సారథి బాధ్యతలు అందివ్వలేదు. వైస్ కెప్టెన్గానూ హార్దిక్ ఎంపికలేదు. ఇటీవల జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించిన యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం గమనార్హం.
మరోవైపు వన్డేలకు అందుబాటులో ఉండటంతో రోహిత్ శర్మనే వన్డే జట్టులో సారథిగా ఎంపికయ్యాడు. విశ్రాంతి తీసుకుంటాడని భావించిన విరాట్ కోహ్లి కూడా జట్టుతో చేరనున్నాడు. యువ బ్యాటర్ రియాన్ పరాగ్ టీ20లతో పాటు వన్డే జట్టులో చోటు సంపాదించాడు. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి టీమిండియాలోకి వచ్చారు. అయితే వన్డేల్లో మాత్రమే ఈ ఇద్దరు ఆడనున్నారు. జట్టు ఎంపికలో నయా కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ స్పష్టంగా కనిపించింది. యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య వన్డేలకు ఎంపిక కాలేదు. పంత్ రాకతో యువ వికెట్ కీపర్లు ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మకు నిరాశే మిగిలింది. మరోవైపు జింబాబ్వేలో సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ టీ20ల్లో ఎంపిక కాలేదు. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి కూడా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
టీమిండియా టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
టీమిండియా వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.