హైదరాబాద్: శ్రీలంక పర్యటనలో టీమిండియా ఎదురే లేకుండా పోయింది. వరుసగా నాలుగో వన్డేలో కూడా విజయం సాధించింది. ఇప్పటికే టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్ను కూడా వైట్ వాష్ చేయడానికి అడుగు దూరంలో నిలిచింది.
కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (96 బంతుల్లో 131; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (88 బంతుల్లో 104; 11 ఫోర్లు, 3 సిక్సర్లు)లు చెలరేగి ఆడటంతో భారత్ 168 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.
తద్వారా ఐదు వన్డేల సిరీస్లో భారత్ 4-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 375 పరుగులు చేసింది. కోహ్లీ, రోహిత్ శర్మలు సెంచరీలతో చెలరేగగా, చివర్లో మనీష్ పాండే (42 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు), ధోని (42 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 42.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. మాథ్యూస్ (80 బంతుల్లో 70; 10 ఫోర్లు), సిరివర్ధన (39) మినహా మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ రాణించలేదు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరిస్లో ఆఖరి వన్డే ఆదివారం జరుగుతుంది.
4వ వన్డే హైలెట్స్:
* ధోనికి ఇది 300వ వన్డే. ఈ ఘనత సాధించిన ఆరో భారత ఆటగాడు. అంతకముందు సచిన్ (463), ద్రవిడ్ (344), అజహరుద్దీన్ (334), గంగూలీ (311), యువరాజ్ (304) ఈ ఘనత సాధించారు.
* కెరీర్లో 300వ వన్డే ఆడిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 73 నాటౌట్లతో వాస్, పొలాక్ (72)లను అధిగమించి వన్డేల్లో అత్యధికంగా నాటౌట్గా నిలిచిన బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు.
* ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ద్వారా శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ 300వ వన్డే వికెట్ సాధించాడు. మొత్తం మీద 300 క్లబ్లో అతనిది 11వ స్థానం.
* శ్రీలంకపై లంకలో వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్మన్గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
* భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలు 3 సార్లు డబుల్ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఎక్కువసార్లు డబుల్ సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన జాబితాలో మరో మూడు జోడీలతో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు.
* ఇక రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలు 150కి పైగా 8 సార్లు భాగస్వామ్యాలను సాధించారు. వన్డేల్లో అత్యధికసార్లు 150పైన భాగస్వామ్యాలు నెలకొల్పిన జాబితాలో సచిన్-గంగూలీ (12) తర్వాత వీరు నిలిచారు.
* వన్డేల్లో కోహ్లీ సాధించిన సెంచరీల సంఖ్య 29. ఈ క్రమంలో జయసూర్య (28) రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ అత్యధిక సెంచరీల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. సచిన్ (49), పాంటింగ్ (30)లు మాత్రమే అతనికన్నా ముందున్నారు.
* కోహ్లీ 185 ఇ న్నింగ్స్ల్లో ఈ ఘనత సాధిస్తే సచిన్కు 265, పాంటింగ్ 330 ఇన్నింగ్స్ తీసుకున్నారు.
* రెండో వికెట్కు రోహిత్-కోహ్లీ నెలకొల్పిన భాగస్వామ్యం 219. భారతకు వన్డేల్లో రెండో వికెట్కు ఇదే అత్యుత్తమం. దీంతో తొలి వన్డేలో ధావన్-కోహ్లీ నెలకొల్పిన 197 పరుగుల భాగస్వామ్యం మరుగున పడిపోయింది.
* ఈ ఏడాది వన్డేల్లో కోహ్లీ చేసిన పరుగులు 907. 2017లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. డుప్లెసిస్ (814) రెండో స్థానంలో ఉన్నాడు.