
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా శనివారం (డిసెంబర్ 2)న మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో కోహ్లీసేన గెలిచిన లేదా డ్రా చేసుకున్నా ప్రపంచ రికార్డుని సమం చేయనుంది.
ఇంతకీ ఆ ప్రపంచ రికార్డు ఏంటని అనుకుంటున్నారా? కోహ్లీసేన ఇప్పటివరకు 8 టెస్టు సిరిస్ విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగే మూడో టెస్టులో కోహ్లీసేన గనుక విజయం సాధిస్తే 2005-08 మధ్య ఆస్ట్రేలియా సాధించిన వరుస సిరీస్ విజయాల రికార్డును సమం చేస్తుంది.
ఇక వచ్చే ఏడాది కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ టెస్టు సిరిస్లో దక్షిణాఫ్రికాను సొంత గడ్డ మీద ఓడిస్తే.. పది సిరీస్ల్లో వరుసగా గెలుపొందిన జట్టుగా టీమిండియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటుంది. 2015లో శ్రీలంక పర్యటనతో భారత్ టెస్టు విజయాల పరంపర మొదలైన సంగతి తెలిసిందే. లంకను సొంత గడ్డపై కోహ్లీసేన వైట్వాష్ చేసింది.
ఆ తర్వాత స్వదేశంలో వరుసగా టెస్టు సిరిస్ విజయాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరిస్లో కోహ్లీసేన 1-0 ఆధిక్యంలో ఉంది. నాగ్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో లంకను ఓడించింది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్ పిచ్లపై కోహ్లీసేన టెస్టులను ఆడుతోంది.