
హైదరాబాద్: ఈ ఏడాది అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో 39 ఏళ్ల రికార్డుని విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.
చివరి టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్గా రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 293 (మొదటి ఇన్నింగ్స్లో 243, రెండో ఇన్నింగ్స్లో 50) పరుగులు చేశాడు. తద్వారా కెప్టెన్గా ఒక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్ధానంలో నిలిచాడు.
ఈ జాబితాలో ఇప్పటివరకు 289 పరుగులతో మొదటి స్థానంలో ఉన్న సునీల్ గవాస్కర్ రెండో స్థానానికి పడిపోయాడు. 1978లో వెస్టిండీస్తో సొంతగడ్డపై జరిగిన టెస్టులో గవాస్కర్ తొలి ఇన్నింగ్స్లో 107, రెండో ఇన్నింగ్స్లో 182 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఓ టెస్టులో ఇదే అత్యధికం.
ఇప్పుడు ఈ రికార్డుని కోహ్లీ అధిగమించాడు. అంతేకాదు కెప్టెన్గా ఓ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్లో డబుల్ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఏడో కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు. మార్క్ టేలర్, గ్రహం గూచ్, గ్రేమ్ స్మిత్, స్టీపెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, సునీల్ గావస్కర్ మాత్రమే కెప్టెన్గా ఓ టెస్టులో డబుల్ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీని నమోదు చేసిన ఆటగాళ్లు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.