తొలి ఓవర్లోనే షాక్:
202 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన లంకకు బుమ్రా తొలి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ గుణతిలక (1) వాషింగ్టన్ సుందర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి అవిష్క పెర్నాండో (9) శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో ఒషాడా ఫెర్నాండో (2)ను మనీశ్ పాండే రనౌట్ చేశాడు. దీంతో కీలక వికెట్లు కోల్పోయిన లంక కష్టాల్లో పడింది.
ఆదుకున్న మ్యాథ్యూస్:
నవ్దీప్ సైనీ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి కుషల్ పెరీరా (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే కష్టాల్లోపడ్డ జట్టును ఎంజిలో మ్యాథ్యూస్, ధనుంజయ డి సెల్వ ఆదుకొనే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వాషింగ్టన్ సుందర్ వేసిన 12వ ఓవర్లో మ్యాథ్యూస్ (31) పాండేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన దాసున్ శనక (9), వానిండు హసరంగా (0), లక్షన్ సందకన్ (1) త్వరగానే పెవిలియన్ చేరారు.
ధనుంజయ పోరాటం:
వికెట్లు పడుతున్నా ధనుంజయ మాత్రం పట్టువదలలేదు. 36 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సులతో 57 పరుగులు చేసాడు. కానీ.. నవ్దీప్ సైనీ బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన మలింగా (0) సైనీ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇవ్వడంతో శ్రీలంక 15.5 ఓవర్లలో 123 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నవ్దీప్ సైనీ 3.. శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ చెరో 2, బుమ్రా 1 వికెట్ తీశారు.
ధావన్, రాహుల్ హాఫ్ సెంచరీలు:
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (52), కేఎల్ రాహుల్ (54)లు శుభారంభాన్ని ఇస్తే.. మనీష్ పాండే (31 నాటౌట్; 18 బంతుల్లో 4 ఫోర్లు), శార్దూల్ ఠాకూర్ (22 నాటౌట్;8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగారు. సుదీర్ఘ విరామం తర్వాత రెండో టీ20 ఆడుతున్న సంజూ సామ్సన్ (6) నిరాశపరిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (26;17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు.