
పుణె: మంగళవారం ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం భారత్-శ్రీలంకల మధ్య చివరిదైన మూడో టీ20 పుణెలో జరుగనుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. అయితే పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఒక రికార్డు ఊరిస్తోంది.
భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కడానికి బుమ్రా ఒక వికెట్ దూరంలో నిలిచాడు. ప్రస్తుతం స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్- యుజువేంద్ర చహల్లతో కలిసి బుమ్రా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రాకు వ్యక్తిగత అత్యధిక వికెట్లు సాధించడానికి వికెట్ కావాలి. అశ్విన్-చహల్-బుమ్రాలు 52 టీ20 వికెట్లతో టాప్లో ఉన్నారు.
పుణె టీ20 మ్యాచ్లో చహల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. శ్రీలంక జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ ఉండటంతో గత మ్యాచ్లో కుల్దీప్కు కెప్టెన్ కోహ్లీ అవకాశం ఇచ్చాడు. కెప్టెన్ అంచనాలను నిలబెట్టడంతో మళ్లీ అతనికే తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. దాంతో చహల్కు నిరాశే ఎదురుకానుంది. దీంతో భారత్ తరఫున అత్యధిక వికెట్ల మార్కును బుమ్రా అందుకునే చాన్స్ ఉంది. బుమ్రా 44 టీ20 మ్యాచ్లు ఆడి 52 వికెట్లు తీసాడు. చహల్ 36 మ్యాచ్ల్లో 52 వికెట్లు తీయగా.. అశ్విన్ 46 మ్యాచ్ల్లో 52 వికెట్లు సాధించాడు.
గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుని రెండో టీ20తో రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. కేవలం ఒక వికెట్ మాత్రమే తీసి విఫలమయ్యాడు. తన కోట 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరున్న బుమ్రా.. ఆఖరి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు ఇచ్చాడు. హసరంగా హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి బుమ్రాను బెంబేలెత్తించాడు. దీంతో బుమ్రా ఇంకా తన మునుపటి ఫామ్ అందుకోలేదని అరడమైంది. చివరి టీ20లో తన సత్తా చాటాలని ఇవ్విళ్లూరుతున్నాడు.