
ధర్మశాల: మూడో టీ20లోనూ టీమిండియా సత్తా చాటింది. ఈ మ్యాచ్లో కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రోహిత్ సేన మరో 21 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో సునాయసంగా శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీతో టీమిండియాను మరో సారి గెలిపించాడు. ఈ సిరీస్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ హాఫ్ సెంచరీలు బాదిన శ్రేయస్ అయ్యర్ ఒకసారి కూడా ఔట్ కాకపోవడం గమనార్హం. టీమిండియా ఈ సిరీస్ను కూడా 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా 3 టీ20 సిరీస్లను క్లీన్స్వీప్ చేయడం విశేషం.
147 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన టిమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులు మాత్రమే చేసి చమీరా బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో ఇండియా 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. టీ20ల్లో రోహిత్ను ఔట్ చేయడం చమీరాకు ఇది ఆరో సారి. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయర్తో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు రెండో వికెట్కు 45 పరుగులు జోడించాక 18 పరుగులు చేసిన సంజూ శాంసన్ కరుణరత్నే బౌలింగ్లో వికెట్ కీపర్ చండీమాల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో దీపక్ హుడా ఈ ఫార్మాట్లో తొలి సారి బ్యాటింగ్కు వచ్చాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి మూడో వికెట్కు 38 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 21 పరుగులు చేసిన దీపక్ హుడా.. లహిరు కుమార బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో ఓ ఫోర్, ఓ సిక్స్ ఉన్నాయి.
అనంతరం వెంకటేశ్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ను ఉందుకు నడిపించిన శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో అయ్యర్కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ. అయితే ఆ కాసేపటికే వెంకటేశ్ అయ్యర్ (5) ఔటవడంతో ఇండియా 12.2 ఓవర్లలో 103 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడిన శ్రేయస్ అయ్యర్ టీంను విజయతీరాలకు చేర్చాడు. అయ్యర్ 73 పరుగులతో, జడేజా 22 పరుగులతో అజేయంగా నిలిచారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఒకానొక దశలో 12.1 ఓవర్లలో 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లంకను కెప్టెన్ దసున్ శనక ఆదుకున్నాడు. చివరి వరకు ఆడి 9 ఫోర్లు, 2 సిక్సులతో 74 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. మిగతావారిలో చండీమాల్ 25, కరుణరత్నే 12 మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ 2, సిరాజ్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.