హైదరాబాద్: పల్లెకెలె వేదికగా భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ రనౌట్ మిస్ చేశాడు. నిజానికి ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోని ఒకడు. అలాంటి ధోని రనౌట్ మిస్ చేయడం అభిమానులను నిరాశకు గురి చేసింది.

వివరాల్లోకి వెళితే.... పల్లెకెలె వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే జరుగుతుంది. ఈ వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో అక్షర్పటేల్ వేసిన 24.5వ బంతిని చండిమాల్ ఎదుర్కొన్నాడు. బంతి ఎక్కువ దూరం పోకున్నప్పటికీ చండిమాల్ పరుగుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో మిడ్ వికెట్కు సమీపాన ఉన్న కేఎల్ రాహుల్ బంతి అందుకొని ధోనికి విసిరాడు. బంతిని అందుకున్న ధోని వికెట్లను గిరాటేసే సమయంలో ధోని చేతుల్లోంచి బంతి చేజారింది. అప్పటికి చండిమాల్ ఇంకా క్రీజులోకి రాలేదు. దీంతో చండిమాల్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.