
గబ్బర్కు పరీక్ష:
తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండా రద్దు కావడంతో తుది జట్టులో ఎలాంటి మార్పు లేకుండానే టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. గతేడాది పొట్టి ఫార్మాట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ధావన్.. గాయం నుంచి కోలుకున్నాడు. వన్డేల్లో ధావన్ బాగానే బ్యాటింగ్ చేస్తున్నా.. టీ20ల్లో మాత్రంస్ట్రయిక్రేట్ ఏమంత గొప్పగా లేదు. దీంతో కేఎల్ రాహుల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. రోహిత్ శర్మకు సహచరుడిగా ఇటీవల రాహుల్ రెండో ఓపెనర్ పాత్రలో అద్భుతంగా ఆడుతున్నాడు. అతను చెలరేగుతున్న తీరును బట్టి చూస్తే పక్కన పెట్టే అవకాశమే లేదు. దాంతో ధావన్ కెరీర్కు సంకటం ఎదురైంది. మాజీల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ధావన్ తన పూర్తి సత్తాను ప్రదర్శించాల్సిందే.

దుర్బేధ్యంగా భారత బ్యాటింగ్:
విరాట్ కొహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబేలతో భారత బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది. గత కొన్ని సిరీస్లుగా బెంచ్కే పరిమితమవుతూ వస్తున్న మనీశ్ పాండే, సంజూ శాంసన్కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. తొలి మ్యాచ్ కోసం కోహ్లీ ముగ్గురు పేసర్లను ఎంచుకున్నాడు. రవీంద్ర జడేజాను పక్కనపెట్టి అతడి స్థానంలో మరో పేసర్కు అవకాశం ఇచ్చాడు.

బుమ్రా రీఎంట్రీ:
నాలుగు నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు యువ పేసర్లు నవ్దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. బ్యాటింగ్కు అనుకూలించే ఇండోర్లో ఓ పేసర్ను తగ్గించి అదనపు బ్యాట్స్మన్ను కోహ్లీ ఎంపిక చేస్తాడా లేదో చూడాలి.

బలహీనంగానే లంక:
ఎక్కువ మంది యువ, అనుభవం లేని ఆటగాళ్లతోనే ఉన్న శ్రీలంక జట్టు భారత్తో పోలిస్తే బలహీనంగానే కనిపిస్తోంది. ఏంజెలో మాథ్యూస్, కుశాల్ పెరీరా మినహా మిగతా బ్యాట్స్మెన్ టీమిండియాను ఎక్కువగా ఎదుర్కొన్నది లేదు. అవిష్క ఫెర్నాండో, గుణతిలక, ఒషాడా ఫెర్నాండో, రాజపక్సలపైనే బ్యాటింగ్ భారం ఉంది. అయితే లంక బౌలింగ్ మారం పర్వాలేదు. మలింగ, షనక, ఉదాన, హసరంగలతో పటిష్టంగానే ఉంది.

పిచ్, వాతావరణం:
హోల్కర్ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం. చిన్న మైదానం కూడా. భారీ స్కోరుకు అవకాశం ఉంది. హోల్కర్ స్టేడియంలో ఒకే ఒక టీ20 మ్యాచ్ రెండేళ్ల క్రితం భారత్, శ్రీలంక మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో టీమిండియా తమ అత్యధిక టీ20 స్కోరు నమోదు చేసింది. మ్యాచ్ రోజు వాతావరణం మేఘావృతమై ఉంటుంది. వర్షం ముప్పు పెద్దగా లేదు. మంచు ప్రభావం కనిపించకుండా ప్రత్యేక తరహా రసాయనాన్ని నిర్వాహకులు వాడనున్నారు.

తుది జట్లు (అంచనా)
భారత్: ధావన్, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్, బుమ్రా, నవ్దీప్ సైనీ.
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, గుణతిలక, కుశాల్ పెరీర, ఒషాడ ఫెర్నాండో, రాజపక్స, ధనంజయ డిసిల్వ, షనక, ఉదాన, హసరంగ, లాహిరు కుమార, మలింగ (కెప్టెన్).


Click it and Unblock the Notifications
