
మంచు ప్రభావం
మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. ప్రస్తుతం శీతాకాలం కాబట్టి మంచు ప్రభావం అధికంగా ఉంటుంది. మొదటగా బౌలింగ్ చేసే జట్టుకు ఇబ్బంది ఏమీ లేకపోయినా.. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే జట్టుకు మంచు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి బౌలర్లకు బంతిపై పట్టు దొరకదు. ఈ కారణంతో టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా.. మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంటాడు.

అవుట్ ఫీల్డ్పై ప్రత్యేక కెమికల్
అయితే ఇండోర్ టీ20లో ఈ మంచు సమస్యను అధిగమించేందుకు మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (ఎంపీసీఏ) చీఫ్ క్యూరేటర్ సమందర్ సింగ్ కొన్ని చిట్కాలు పాటిస్తున్నాడు. మంచు ప్రభావాన్ని తగ్గించేందుకు అవుట్ ఫీల్డ్పై ప్రత్యేక కెమికల్ను చల్లుతున్నట్లు తెలిపాడు. గత మూడు రోజుల నుంచి ఇదే విధంగా చేస్తున్నామని పేర్కొన్నాడు. మరోవైపు మైదానంలోని గడ్డిపై నీళ్లు కూడా చల్లడం లేదని ఆయన చెప్పుకొచ్చాడు.

బ్యాటింగ్కు స్వర్గధామం
కచ్చితంగా రెండో టీ20 మ్యాచ్లో ఫోర్లు, సిక్సర్లతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా అని సమందర్ సింగ్ చెప్పాడు. ఇండోర్ పిచ్ బ్యాటింగ్కే అనుకూలిస్తుంటుంది. చిన్న మైదానం కాబట్టి భారీ స్కోరుకు అవకాశం ఉంది. హోల్కర్ స్టేడియంలో ఒకే ఒక టీ20 మ్యాచ్ రెండేళ్ల క్రితం భారత్, శ్రీలంక మధ్య జరిగింది. ఈ ఫార్మాట్లో అత్యుత్తమ స్కోరు 260/5ని ఇదే స్టేడియంలో నమోదు చేసింది. ఈ రోజు వాతావరణం మేఘావృతమై ఉంటుంది. వర్షం ముప్పు పెద్దగా లేదు.
తొలి మ్యాచ్ రద్దు
తొలి టీ20ని అంపైర్లు రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించకముందే కొందరు ఆటగాళ్లు స్టేడియం నుంచి వెళ్లిపోయారని అసోం క్రికెట్ అసోషియేషన్ (ఏసీఏ) కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నాడు. గువాహటి వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ వర్షం, నిర్వహణ వైఫల్యం వల్ల రద్దైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












