హైదరాబాద్: కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుపై కోహ్లీసేన పట్టు బిగించింది. భారత్ బౌలర్ల విజృంభణతో తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య శ్రీలంక లంచ్ విరామ సమయానికే 183 పరుగులకే ఆలౌటైంది. 50/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట ప్రారంభించిన శ్రీలంక మరో 133 పరుగులు మాత్రమే చేసి మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది.
దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత్కు 439 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. శ్రీలంక ఫాలోఆన్ పడింది. దీంతో శ్రీలంక బ్యాట్స్మెన్ రక్షణాత్మక ఆటకే పరిమితమవుతున్నారు. గాలే టెస్టుకి వైరల్ ఫీవర్ కారణంగా దూరమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ కొలంబో టెస్టులో తన పునరాగమనాన్ని ఘనంగానే చాటుకున్న సంగతి తెలిసిందే.

తొలి ఇన్నింగ్స్లో అర్ధసెంచరీ చేసిన రాహుల్ ఫీల్డింగ్లో మాత్రం అదరగొడుతున్నాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ ఉపుల్ తరంగ బలహీనతని పసిగట్టిన కెప్టెన్ కోహ్లీ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో ఒక వ్యూహాన్ని రచించాడు. ఇందులో భాగంగానే షార్ట్ ఫైన్లెగ్లో కేఎల్ రాహుల్ని ఫీల్డర్గా ఉంచాడు.
లెగ్ వికెట్కి దూరంగా వైడ్ రూపంలో అశ్విన్ బంతి విసరగా దానిని గల్లీ దిశగా తరలించేందుకు ఉపుల్ తరంగ ప్రయత్నించాడు. అయితే ఆ బంతి బ్యాట్ని తాకి నేరుగా రాహుల్ శరీరంపైకి దూసుకొచ్చింది. ఈ సమయంలో క్యాచ్ అందుకోలేకపోయిన రాహుల్ చాకచక్యంగా వ్యవహరించి బంతిని అలానే శరీరంపై అదిమిపట్టుకున్నాడు.
ఈ క్యాచ్కి నివ్వెరపోయిన ఉపుల్ తరంగ నిరాశగా పెవిలియన్కు చేరాడు. దీంతో భారత జట్టు సంబరాలు చేసుకుంది. ఈ సంతోషంలో కేఎల్ రాహుల్ మైదానంలో తిరుగుతూ సంబరాలు చేసుకున్నాడు. ఫుట్బాల్ క్రీడాకారుల తరహాలో రాహుల్, కోహ్లీ డాబ్ స్టైల్ సంబరాలు చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 622/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.