హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు శ్రీలంక పర్యటనతో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన యువ బౌలర్ శార్దూల్ ఠాకుర్ అన్నాడు. బుధవారం శ్రీలంకతో ఏకైక టీ20 జరగనున్న నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ మీడియాతో మాట్లాడాడు.
మెంటార్గా ధోని ఎంతో సాయం చేశారని, అతని వల్లే అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్నానని చెప్పాడు. ధోని వికెట్ కీపర్ కావడంతో ఎంతో మంది బౌలర్ల బౌలింగ్ను ఆయన గమనిస్తాడని తెలిపాడు. టీమ్ ఒత్తిడిలో ఉన్న సమయంలో ఎలా బౌలింగ్ చేయాలో ధోనికి బాగా తెలుసని అన్నాడు.

ధోని 300వ వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోని కెప్టెన్సీలో ఆడాడు. ఈ చొరవతోనే అవసరమైన సమయంలో ధోని దగ్గరికి వెళ్లి సలహాలు తీసుకుంటానని శార్దూల్ చెప్పడం విశేషం. ఇక, శ్రీలంక పర్యటనలో భాగంగా బుధవారం ఏకైక టీ20 జరగనుంది.
ఇప్పటికే వన్డే, టెస్టు సిరిస్లను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీ సేన టీ20ని సైతం గెలిచి పర్యటనను విజయవంతంగా ముగించాలని భావిస్తోంది. భారత్తో జరిగిన 10 టి20ల్లో శ్రీలంక నాలుగు మ్యాచ్లు గెలిచి ఆరు ఓడింది. అయితే ఈ స్టేడియంలో శ్రీలంక ఆడిన మొత్తం 13 మ్యాచ్ల్లో కేవలం రెండు మాత్రమే నెగ్గడం ఆ జట్టును ఆందోళన కలిగిస్తోంది.