
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీసేన పేలవమైన ఫీల్డింగ్ను ప్రదర్శిస్తోంది. ఆదివారం రెండు క్యాచ్లను వదిలేసిన కోహ్లీసేన సోమవారం మరో క్యాచ్ని వదిలేసింది. దీంతో తనకు లభించిన రెండు లైఫ్లను సద్వినియోగం చేసుకున్న శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ సెంచరీతో చెలరేగాడు.
ఢిల్లీ టెస్టులో టాస్ గెలిచిన కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్ను 536/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన లంక తొలి బంతికే తొలి వికెట్ను కరుణరత్నే రూపంలో కోల్పోయింది. ఆ తరవాత 14 పరుగుల వద్ద డిసిల్వా వికెట్ను కూడా చేజార్చుకుంది. ఆ తర్వాత భారత్ రెండు క్యాచ్లను జారవిడిచింది.
ఆదివారమైన రెండో రోజు టీ విరామం అనంతరం షమీ వేసిన ఓవర్లో దిల్రువన్ పెరీరా ఇచ్చిన క్యాచ్ను సెకండ్ స్లిప్లో ఉన్న శిఖర్ ధావన్ చేజార్చాడు. ఆ బంతి కాస్త కీపర్ వెనకాల ఉన్న హెల్మెట్కు తగలడంతో పెనాల్టీ కింద లంకకు 5 పరుగులు కూడా దక్కాయి. అప్పటికి పెరీరా 16 పరుగుల వద్ద ఉన్నాడు. ఆ తర్వాత పెరీరా 42 పరుగులు సాధించి జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు.

ఇక, శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్కు ఈ మ్యాచ్లో రెండు లైఫ్లు లభించాయి. ఆ రెండు లైఫ్లను సద్వినియోగం చేసుకున్న మాథ్యూస్ సెంచరీతో చెలరేగాడు. ఆదివారం మాథ్యూస్ (6) పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీ ద్వారా లైఫ్ లభించగా... సోమవారం ఇషాంత్ శర్మ వేసిన బౌలింగ్లో మాథ్యూస్ (98) పరుగుల వద్ద ఉన్నప్పుడు స్లిప్లోకి క్యాచ్ ఇచ్చాడు.
ఆ క్యాచ్ను అందుకోవడంలో రెండో స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ తడబడ్డాడు. దీంతో ఈ రెండు తప్పిదాలతో బతికిపోయిన మాథ్యూస్ తన టెస్టు కెరీర్లో ఎనిమిదో సెంచరీని సాధించాడు. ఇలా తనకు లభించిన రెండు లైఫ్లతో మాథ్యూస్ భారత బౌలర్లకు కఠిన పరీక్ష పెట్టాడు. మూడో రోజు ఆటలో భాగంగా రెండు సెషన్లు పాటు బౌలర్లకు పరీక్ష పెట్టిన మాథ్యూస్-చండీమాల్ జోడీని అశ్విన్ ఎట్టకేలకు విడగొట్టాడు.
అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 98 ఓవర్ చివరి బంతికి సాహాకు క్యాచ్ ఇచ్చిన మాథ్యూస్(111) పెవిలియన్ చేరాడు. దాంతో వీరిద్దరి 181 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ సెంచరీ చేశాడు. 104వ ఓవర్లో అశ్విన్ వేసిన తొలి బంతికి సింగిల్ రన్ తీసిన చండీమాల్ 100 పరుగులు పూర్తి చేశాడు.
టెస్టుల్లో చండీమాల్కు ఇది పదో సెంచరీ. ఈ ఏడాది మూడో సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 118 ఓవర్లకు గాను శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది. చండీమాల్ 117, నిరోషాన్ డిక్వెల్లా పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.