
హైదరాబాద్: క్రికెట్లో విన్నింగ్ షాట్కు ఎంతో ప్రత్యేకత ఉంది. చివరి వరకు క్రీజులో బ్యాట్స్మెన్ విన్నింగ్ షాట్ కొట్టాలని పరితపిస్తుంటాడు. కానీ.. ఆ విన్నింగ్ షాట్ కొట్టే క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అయితే అభిమానులకు ఇక పండగే. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోని బాదిన విన్నింగ్ షాట్ అయితే ప్రతి క్రికెట్ అభిమానికి ఇప్పటికీ గుర్తే.
అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో మ్యాచ్ల్లో విన్నింగ్ షాట్లు బాదిన మహేంద్ర సింగ్ ధోని ఈ ఏడాది ఆఖరి విన్నింగ్ షాట్ని ఆదివారం వాంఖడె స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో బాదాడు. ఈ షాట్ చూసి అభిమానులంతా మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది.
పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 31 వేలకు పైగా వ్యూస్, ఏడువేల లైక్లు వచ్చాయంటే అర్ధం చేసుకోండి. ఆన్సైడ్లో చూడచక్కని బౌండరీ కొట్టిన ధోని జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఏడాది భారత్ ఆడిన ఆఖరి మ్యాచ్ ఇది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టీ20లో ధోని, కార్తీక్లు భారత్ విజయాన్ని అందించారు.
చివరి రెండు ఓవర్లో భారత్ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న వీరిద్దరూ సింగిల్స్ తీశారు. కార్తీక్ సిక్స్ కొట్టడంతో చివరి ఓవర్లో 3 పరుగులు అవసరమయ్యాయి. స్ట్రైకింగ్లో ఉన్న ధోని తొలి బంతికి రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతిని ఫోర్గా మలిచి విన్నింగ్ షాట్తో మ్యాచ్ను ముగించాడు.
దీంతో నాలుగు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించింది. తాజా విజయంతో మూడు టీ20ల సిరిస్ను 3-0తో భారత్ క్లీవ్ స్వీప్ చేసింది. దక్షిణాఫ్రికా సిరీస్ వచ్చే ఏడాది మొదలవుతుంది. ఈ ఏడాది భారత్ అన్ని ఫార్మాట్లలో కలిపి 37 విజయాలు సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో భారత్ది రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. 2003లో ఆస్ట్రేలియా 38 విజయాలతో అగ్రస్ధానంలో ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.