
హైదరాబాద్: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీకి ఇది 50వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. 119 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.
అంతేకాదు ఈ సెంచరీకి ఎంతో ప్రత్యేకతం ఉంది. విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్లో ఈడెన్లో చేసిన తొలి సెంచరీ ఇది. ఇన్నింగ్స్ 88.4వ బంతిని సిక్స్గా మలిచి కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకూ తన టెస్టు కెరీర్లో 18 సెంచరీలను నమోదు చేసిన కోహ్లీ ఈడెన్ గార్డెన్స్లో ఒక్కటీ నమోదు చేయలేదు.
ఇందులో 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే తొలిసారి ఈడెన్ గార్డెన్స్లో సత్తాచాటాడు. రెండో ఇన్నింగ్స్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం చివరి రోజు ఆటలో బ్యాటింగ్కు దిగిన కోహ్లీ లంచ్ విరామం తర్వాత సెంచరీని నమోదు చేశాడు.
ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ అరుదైన క్లబ్లో చేరాడు. వన్డేల్లో 32 సెంచరీలు చేసిన కోహ్లీకి.. టెస్టుల్లో ఇది 18వ సెంచరీ. సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) తర్వాత క్రికెట్లో 50 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన రెండో క్రికెటర్ భారత క్రికెటర్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
పాంటింగ్ (71), సంగక్కర (63), కలిస్ (62), ఆమ్లా (54), జయవర్దనె (54), లారా (53) అంతర్జాతీయ క్రికెట్లో 50కిపైగా సెంచరీలు చేశారు.
భారత్-శ్రీలంక తొలి టెస్టు డ్రా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 231 పరుగుల విజయ లక్ష్యంతో చివరిరోజైన సోమవారం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. దీంతో విజయం దిశగా పయనించిన కోహ్లీసేన డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు సాధించగా, షమీ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.ఇరు జట్ల మధ్య రెండో టెస్టు నవంబర్ 24(శుక్రవారం) నాగ్ పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.