ఓవర్ నైట్ స్కోరు 74/5తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్
ఓవర్ నైట్ స్కోరు 74/5తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ కొద్దిసేపటికే హాఫ్ సెంచరీ చేసిన పుజారా వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా-సాహా జోడి ఆచితూచి నెమ్మిదిగా ఆడుతూ పరుగులు పెంచే ప్రయత్నిం చేశారు. అయితే వీరిద్దరిని శ్రీలంక స్పిన్నర్ పెరీరా వీరిద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేసి భారత్కు షాకిచ్చాడు. వీరిద్దరూ ఏడో వికెట్కు 48 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. చివర్లో షమీ (24), భువనేశ్వర్ కుమార్ (13) పరుగులు చేయడంతో స్కోరుబోర్డు కాస్త కోలుకుంది. ఉమేష్ యాదవ్ 6 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇలా లోయర్ ఆర్డర్ ఆదుకోవడంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులు చేసింది.
34 పరుగుల వద్ద ఓపెనర్లను కోల్పోయి శ్రీలంక
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు స్కోరు 34 పరుగుల వద్ద ఓపెనర్లను కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఓపెనర్లను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లాహిరు తిరుమన్నే (94 బంతుల్లో 51; 8ఫోర్లు), ఏంజెలో మాథ్యూస్ (94 బంతుల్లో 52; 8ఫోర్లు) శ్రీలంకను ఆదుకున్నారు. భారత ఫీల్డర్ల తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న వీరిద్దరూ మూడో వికెట్కు 99 పరుగులు జోడించారు. భారీ భాగస్వామ్యం దిశగా సాగుతున్న వీరిద్దని ఉమేశ్ యాదవ్ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. ఉమేష్ వేసిన 36 ఓవర్ తొలి బంతికే తిరుమన్నే థర్డ్ స్లిప్లో ఉన్న విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
వెలుతురులేమి కారణంగా మూడోరోజు మ్యాచ్ని నిలిపివేసిన అంఫైర్లు
ఆ తర్వాత బౌండరీతో హాఫ్ సెంచరీ సాధించిన ఏంజెలో మాథ్యూస్ (52) 38.5వ బంతికి ఫీల్డర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 37 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. వీరిద్దరూ అవుట్ కావడంతో శ్రీలంక జట్టు స్కోరు నెమ్మదించింది. కెప్టెన్ దినేష్ చండీమల్ (13 బ్యాటింగ్), నిరోషన్ డిక్వెల్లా (14 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 45.4 ఓవర్లకి 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసిన శ్రీలంక.. మరో 7 పరుగులు చేస్తే భారత్ స్కోరును అధిగమిస్తుందన్న సమయంలో వెలుతురులేని కారణంగా అంఫైర్లు మూడోరోజు మ్యాచ్ని నిలిపివేశారు.
చివరి బంతిని వేసిన కోహ్లీ
ఇదిలా ఉంటే 44.5వ ఓవర్లో తొడ కండరాలు పట్టేయడంతో షమీ మైదానం వీడగా.. ఆ ఓవర్లో చివరి బంతిని కోహ్లీ వేయడం విశేషం. తొలి ఇన్నింగ్స్లో లంక బౌలర్లలో సురంగ లక్మల్కు 4 వికెట్లు దక్కగా.. షనక, పెరీరా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. నాలుగో రోజైన ఆదివారం భారత బౌలర్లు శ్రీలంక బ్యాట్స్మెన్ను ఎంత తొందరగా ఔట్ చేస్తారనే దానిని బట్టి మ్యాచ్ ఫలితం ఉంటుంది.