
ఒంటి గంటకు టాస్
దీంతో ఒంటి గంటకు టాస్ పడింది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇక్కడ టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన చివరి 16 టెస్టుల్లో టాస్ గెలిచిన ఏ కెప్టెన్ కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకోలేదు. చివరి సారిగా 1987లో ఇక్కడ ఆడిన పాకిస్థాన్ జట్టు ఇక్కడ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే గత కొన్ని రోజులుగా కోల్కతాలో వర్షాలు కురుస్తుండటంతో పిచ్పై పచ్చిక ఉండటం, వర్షం కారణంగా తేమ ఉండటంతో లంక కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపాడు.

టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ
దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ నమ్మకాన్ని నిలబెడుతూ లక్మల్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ కేఎల్ రాహుల్ను పెవిలియన్ చేర్చాడు. వికెట్ కీపర్ డిక్విల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఖాతా తెరవకుండానే భారత్ వికెట్ కోల్పోయింది. రాహుల్ డకౌట్గా అవుటైన తర్వాత పుజారా క్రీజులోకి వచ్చాడు. అనంతరం 6.2వ ఓవర్లో లక్మల్ వేసిన బంతికి ధావన్(8) బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ కూడా కుదరుకునేందుకు ఇబ్బందిపడ్డాడు.

వర్షం, వెలుతురు సరిగా లేని కారణంగా మ్యాచ్ నిలిపివేత
వర్షం, వెలుతురు సరిగా లేని కారణంగా 8.2 ఓవర్ల వద్ద మ్యాచ్ను అంపైర్లు సుమారు గంటపాటు నిలిపివేశారు. అనంతరం మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. ధావన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ 11 బంతులాడి పరుగులేమి చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 17 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ కోల్పోయిన మూడు వికెట్లు కూడా శ్రీలంక బౌలర్ లక్మల్కే దక్కాయి. 6 ఓవర్లు వేసిన లక్మల్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా పదునైన బంతులతో భారత టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు.

తొలిరోజు మొత్తం 11.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం
12వ ఓవర్లో లాహిరు గమేజ్ వేసిన ఐదో బంతిని ఎదుర్కొనేందుకు పుజారా ఇబ్బంది పడ్డాడు. బంతి సరిగా కనిపించడంలేదని అంపైర్లకు తెలిపాడు. దీంతో వారు మ్యాచ్ను నిలిపివేశారు. సాయంత్రం 4.20 గంటలకు వెలుతురు సమస్య కారణంగా 11.5 ఓవర్ల వద్ద తొలి రోజు ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో తొలిరోజు మొత్తం 11.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఉదయం నుంచి మ్యాచ్కి వరుణుడు అడ్డంకిగానే మారాడు. బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉన్న పిచ్పై టీమిండియా తడబడింది. 11.5 ఓవర్లు ఆడిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగింది.


Click it and Unblock the Notifications