
హైదరాబాద్: విజయంతో కొత్త ఏడాది ఘనంగా ఆరంభించాలనుకున్న కోహ్లీసేనకు నిరాశే మిగిలింది. గువహటి వేదికగా ఆదివారం జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. అయితే, వర్షం తగ్గిన తర్వాత పిచ్ని ఆరబెట్టేందుకు సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయిందంటే ఇంకా బాగుంటుంది.
వరుణుడు తగ్గుముఖం పట్టిన తర్వాత పిచ్ను ఆరబెట్టేందుకు మైదాన సిబ్బంది చేసిన ప్రయత్నాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పిచ్పై ఉన్న తేమను ఆరబెట్టేందుకు సిబ్బంది ఇస్త్రీ పెట్టె, హెయిర్ డ్రైయిర్లు వాడారు. అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ తరహా విధానాన్ని అవలంభించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
"1980 కాదురా నాయనా.. 2020 ఏకంగా ఫ్లైయింగ్ కార్స్ని వాడతారనుకుంటే, మరి ఏమిటో మనం వెనక్కి పయనిస్తున్నాం. ఇది బీసీసీఐకే సిగ్గుచేటు" అని ఓ నెటిజన్ ఎద్దేవా చేశాడు. "పిచ్ను హెయిర్ డ్రయర్తో ఆరబెట్టారు.. ఇక పిచ్ను చదును చేసే క్రమంలో మన తలలతో చేస్తే బాగుంటుందేమో?" అని మరో నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
కాగా, మ్యాచ్ రద్దు కావడానికి వర్షం కంటే నిర్లక్ష్యం పాత్రే ఎక్కువని కామెంటేటర్లు ఆకాశ్ చోప్రా, వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం ఇండోర్ వేదికగా రెండో టీ20 జరగనుంది.