భారత్ మరో సమరానికి సిద్ధమైంది. శ్రీలంక పర్యటనలో భాగంగా రేపటి నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి పోరుతో పాటు అన్ని మ్యాచ్లు పల్లెకెలె వేదికగా జరగనున్నాయి. టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన శ్రీలంకపై రికార్డులు, ఫామ్ పరంగా ఛాంపియన్ ఇండియాదే పైచేయి. అయితే కోచ్గా గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు అందుకున్న తర్వాత భారత్ ఆడే తొలి సిరీస్ ఇదే కావడంతో లంక పర్యటనపై ఆసక్తి పెరిగింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్, టీ20 వరల్డ్ కప్-2026ల లక్ష్యంగా భారత జట్టును సిద్ధం చేయాలని గంభీర్ భావిస్తున్నాడు. దీని కోసం లంకతో జరిగే టీ20 సిరీస్తోనే తన కార్యచరణ మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నయా కోచ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాడు.

టీ20 వరల్డ్ కప్ విజేత జట్టులో శివమ్ దూబె సభ్యుడు. ఫైనల్లో భారత్ విజయంలో దూబె కీలకపాత్ర పోషించాడు. 16 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. అయితే టోర్నీ మొత్తంగా దూబె ఆకట్టుకోలేకపోయాడు. నిలకడగా పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. జట్టులో పూర్తిస్థాయి బ్యాటర్గానే ఎంపికయ్యాడు. దీంతో దూబెకు బదులుగా నిలకడగా పరుగులు సాధించే రింకూ సింగ్ను జట్టులో కొనసాగించాలని గంభీర్ భావిస్తున్నాడు.
దూబె, రింకూ ఇద్దరు మిడిలార్డర్ ఎడమచేతి వాటం బ్యాటర్లే. అయితే రింకూ ఫినిషర్గా గొప్పగా సత్తాచాటే సామర్థ్యం ఉంది. అంతేగాక రింకూ ప్రతిభను కేకేఆర్లో గంభీర్ చాలా దగ్గర నుంచి చూశాడు. దీంతో దూబెకు బదులుగా రింకూ ఇవ్వాలని గంభీర్ యోచిస్తున్నాడు. కాగా, హార్దిక్ పాండ్యలా ఉత్తమమైన ఆల్రౌండర్గా దూబెను సిద్ధం చేయాలని బీసీసీఐ గత కొన్నినెలలుగా భావిస్తుంది. దీన్ని అమలు చేయాలని గంభీర్పై ఒత్తిడి ఎదురైతే రియాన్ పరాగ్ను పక్కనపెట్టి దూబెకు తొలి టీ20లో ఛాన్స్ దక్కనుంది. కానీ రింకూ సింగ్ మాత్రం టీ20 జట్టులో తన స్థానం సుస్థిరమైనట్లే.
శ్రీలంకతో జరిగే తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా)
శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ (కెప్టెన్), రిషభ్ పంత్, రియాన్ పరాగ్/శివమ్ దూబె, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్,
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.