
కొలంబో: శ్రీలంకతో వన్డే సిరీస్ను భారత యువ జట్టు ఘనంగా ఆరంభించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్; 95 బంతుల్లో 6×4, 1×6), యువ ఓపెనర్ పృథ్వీ షా (43; 24 బంతుల్లో 9×4), హిట్టర్ ఇషాన్ కిషన్ (59; 42 బంతుల్లో 8×4, 2×6) చెలరేగడంతో ఆదివారం తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువకులు సత్తాచాటడంతో భారత్ 36.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. చమిక కరుణరత్నె (43 నాటౌట్; 35 బంతుల్లో 1×4, 2×6), కెప్టెన్ దసున్ శనక (39; 50 బంతుల్లో 2×4, 1×6), చరిత్ అసలంక (38; 65 బంతుల్లో 1×4) పోరాడడంతో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్లకు 262 పరుగులు చేసింది.
తొలి వన్డేలో శిఖర్ ధావన్ పలు రికార్డులు నెలకొల్పాడు. వన్డేల్లో భారత జట్టుకి నాయకత్వం వహించిన 25వ కెప్టెన్గా రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో లేటు వయసులో జట్టు పగ్గాలు అందుకున్న భారత కెప్టెన్గా గబ్బర్ నిలిచాడు. 35 సంవత్సరాల 225వ రోజు ధావన్ టీమియా పగ్గాలు అందుకున్నాడు. దీంతో 1984లో తొలిసారిగా భారత జట్టుకు నాయకత్వం వహించిన మొహిందర్ అమర్నాథ్ రికార్డును బద్దలు కొట్టాడు. పాకిస్థాన్పై 34 సంవత్సరాల 37 రోజుల వయసులో అమర్నాథ్ తొలిసారిగా టీమిండియాకు నాయకత్వం వహించాడు. సయ్యద్ కిర్మానీ (33 సంవత్సరాల 353 రోజులు), అజిత్ వాడేకర్ (33 సంవత్సరాలు 103 రోజులు)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
శిఖర్ ధావన్ వన్డేలో 6000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన పదో భారత బ్యాట్స్మన్గా నిలిచాడు గబ్బర్. 6000 పరుగులు పూర్తిచేయడానికి ధావన్ 140 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. వివ్ రిచర్డ్స్, జో రూట్ (వీరిద్దరూ 141 ఇన్నింగ్స్లు)లను వెనక్కి నెట్టాడు. హషీమ్ ఆమ్లా (123 ఇన్నింగ్స్లు), విరాట్ కో హ్లీ(136 ఇన్నింగ్స్లు), కేన్ విలియమ్సన్ (139 ఇన్నింగ్స్లు) అతడి కంటే ముందున్నారు. ఈ జాబితాలో భారత్ తరఫున కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. గబ్బర్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 147 ఇన్నింగ్స్లలో 6000 వన్డే పరుగులు సాధించాడు.
# హాఫ్ సెంచరీతో రాణించిన శిఖర్ ధావన్ శ్రీలంకపై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. 17 ఇన్నింగ్స్ల్లోనే 1000 రన్స్ చేశాడు. భారత మాజీ కెప్టెన్ గంగూలీ ఇందుకు 20 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఈ క్రమంలో దాదా రికార్డును తిరగరాశాడు.
# కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్లోనే అర్ధ శతకం బాదిన ఐదో భారతీయుడిగా గబ్బర్ సరికొత్త ఫీట్ సాధించాడు. అతడికంటే ముందు అజిత్ వాడేకర్, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, అజయ్ జడేజా, ఎంఎస్ ధోనీ ఉన్నారు.
# వన్డేలో 33వ అర్ధ శతకం సాధించిన శిఖర్ ధావన్.. అంతర్జాతీయ కెరీర్లో 10వేల మార్క్ను అందుకున్నాడు. ఈ ఘనత అందుకున్న 14వ భారత బ్యాట్స్మన్ గబ్బర్.
# కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే గబ్బర్ జట్టుని ముందుండి గెలిపించాడు.