
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో టీమిండియా ఓటమి పాలైన తర్వాత కోహ్లిపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. స్వదేశంలో సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఘనత సాధించిన కోహ్లి.. విదేశీ పర్యటనలో ఘోర పరాభవాన్ని చవిచూశాడంటూ మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మండిపడ్డారు.
ప్రధానంగా కోహ్లి కెప్టెన్సీని టార్గెట్ చేస్తూ విమర్శకులు తమ నోటికి పని చెప్పారు. అయితే కోహ్లికి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కెప్లెర్ వెసెల్స్ నుంచి ఊహించని మద్దతు లభించింది. సారథిగా కోహ్లి వ్యవహరించే స్టైల్లో ఎవరైనా తప్పులు వెతికే పని చేస్తే మాత్రం చివరకు నిరాశ తప్పదంటూ వెసెల్స్ అభిప్రాయపడ్డాడు.
'ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లినే బెస్ట్. అందులో ఎటువంటి సందేహం లేదు. సహచర ఆటగాళ్లపై నమ్మకాన్ని ఉంచుతూ గెలుపు కోసం కృషి చేసే కెప్టెన్ కోహ్లి. విరాట్ను బ్యాటింగ్ పరంగా చూసినా, నాయకుడిగా చూసినా గెలుపే అతని లక్ష్యం. ఆ క్రమంలోనే ఫీల్డ్లో అతను దూకుడుగా ఉంటాడు. ఆ దూకుడు కొన్ని సందర్బాల్లో మంచి చేస్తే, కొన్నిసార్లు విఫలం కూడా కావొచ్చు. ఓవరాల్గా చూస్తే భారత జట్టును నడిపించే విధానంలో కోహ్లిని వేలెత్తి చూపలేరు' అని వెసెల్స్ పేర్కొన్నాడు.
మరొకవైపు భారత పేసర్లు మొహ్మద్ షమీ, భువనేశ్వర్లపై వెసెల్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఇద్దరూ అత్యుత్తమ టెస్టు బౌలర్లంటూ కొనియాడాడు. దాంతో పాటు ఇషాంత్ శర్మ, రవి చంద్రన్ అశ్విన్లు కూడా మెరుగ్గా రాణించారన్నాడు.
'టెస్టు సిరీస్ ఆడుతున్న సమయంలో టీమిండియా ఏ సమయంలోనూ తన బ్యాలెన్స్ను కోల్పోలేదు. కెప్టెన్గా నాకు తెలుసు రెండు టెస్టుల పరాజయం తర్వాత జట్టును గెలిపించాలంటే ఎంత కష్టపడాలోనన్న విషయం. భారత్ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా బౌలింగ్ను, అక్కడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోలేకపోవడంతోనే రెండు టెస్టుల్లోనూ ఓడిపోయారని భావించాను. చివరికి గెలిచి చూపించారు. అని అభిప్రాయపడ్డాడు.
భారత బౌలర్లు సైతం దక్షిణాఫ్రికా గడ్డపై చక్కగా రాణించారని తెలిపాడు. ప్రత్యేకంగా జస్ప్రతి బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ ప్రత్యేకంగా నిలిచారని కొనియాడాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లను తికమక పెట్టిన ఆటగాళ్లంటూ పేర్కొన్నాడు. రవి చంద్రన్ అశ్విన తన అనుభవాన్ని చాటాడు. సఫారీ బ్యాట్స్మెన్లను పడగొట్టాడని తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.