
హైదరాబాద్: మూడో టెస్టు గురించి దక్షిణాఫ్రికా ఏమీ ఆలోచించడం లేదని, కోహ్లీసేన వైట్ వాష్ లక్ష్యంగా బరిలోకి దిగుతామని దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ వెల్లడించాడు. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను మరో టెస్టు మిగిలుండగానే కోహ్లీసేన 0-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు జనవరి 24న జోహెన్స్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫిలాండర్ మీడియాతో మాట్లాడుతూ 'జట్టుకి ఇది మరో మ్యాచ్ మాత్రమే. ప్రతి మ్యాచ్ గెలవాలనే తపనతోనే ఆడతాం. ఇప్పటికే సిరీస్ చేజిక్కినా.. ఉదాసీనతకి తావివ్వకుండా మూడో టెస్టులో గెలిచి సిరిస్లో భారత్ని వైట్వాష్ చేస్తాం' అని అన్నాడు.
'చివరి టెస్టు గురించి దక్షిణాఫ్రికా ఏమీ ఆలోచించడం లేదు. మూడో టెస్టు కోసం ఇప్పటికే కఠినంగా ప్రాక్టీస్ చేసి బుధవారం మ్యాచ్కి సిద్ధమయ్యాం. టెస్టు ర్యాంకింగ్స్లో జట్టు మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకోవాలంటే.. ఇకపై ఆడే అన్ని టెస్టుల్లోనూ గెలవాలని నిర్ణయించుకున్నాం' అని ఫిలాండర్ వివరించాడు.
ఇక, మూడో టెస్టు కోసం గ్రీన్ వికెట్ని రూపొందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సెంచూరియన్ పిచ్తో పోలిస్తే మూడో టెస్టు జరిగే వాండరర్స్ పిచ్ చాలా భిన్నంగా ఉండబోతుంది. 'పిచ్ను ఇంకా పరిశీలించలేదు. వాండరర్స్ పిచ్ అనేది పేస్, బౌన్స్కు అనుకూలం. పేస్లరకు బాగా కలిసివస్తుంది. చివరి టెస్టులో స్పిన్నర్తో బరిలో దిగాలా వద్దా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పిచ్లను బట్టి బౌలర్ల రోల్స్ మారుతుంటాయి' అని ఫిలాండర్ పేర్కొన్నాడు.
సఫారీ పర్యటనకు కోహ్లీసేన 10 రోజులు ముందు గనుక వచ్చినట్లైతే ఇక్కడి పరిస్థితులను అలవాటు పడేవారని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై ఫిలాండర్ స్పందించాడు. 'అవును. ఈ విషయంలో జట్టు మేనేజ్మెంట్ ఆటగాళ్లతో చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది' అని అన్నాడు.
కాగా, మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ భారత బౌలర్లు రాణించినా, బ్యాట్స్మెన్ మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. దీంతో కనీసం మూడో టెస్టులోనైనా సత్తాచాటి పరువు నిలుపుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. వాండరర్స్ స్టేడియంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది.
సఫారీ గడ్డపై టీమిండియా ఇప్పటివరకు గెలిచిన రెండు టెస్టుల్లో ఒకటి వాండరర్స్లోనే గెలవడం విశేషం. అంతేకాదు ఈ స్టేడియంలో టీమిండియా ఇప్పటివరకు నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడగా అందులో ఒక దాంట్లో విజయం సాధించగా... మూడు టెస్టులను డ్రా చేసుకుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.